బీసీలపై రాజకీయ పార్టీలది సవతి తల్లి ప్రేమ : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలపై రాజకీయ పార్టీలది సవతి తల్లి ప్రేమ : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు పోవాలి: జాజుల 

బషీర్​బాగ్, వెలుగు: బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీ మేధావుల ఫోరమ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాజుల ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించి, ఎన్నికల సంఘానికి నివేదించాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు రోజుకొక మాట చెప్తూ , బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్.. బీసీల వ్యతిరేక పార్టీ అని.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే రిజర్వేషన్లను తేల్చాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 48 గంటల్లోగా అఖిలపక్షాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లి, రిజర్వేషన్ల అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

బీజేపీకి బీసీల ఓట్లు కావాలంటే.. 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చాలని కోరారు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని జాజుల అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రిజర్వేషన్ల అంశం.. ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. చిరంజీవులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపు అని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వారం రోజుల్లో అమలు చేసిన కేంద్రం.. 42 శాతం బీసీల రిజర్వేషన్లపై ఎందుకు  ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు. బీసీలలో చైతన్యం వచ్చిందని, 2028లో వచ్చేది బీసీల రాజ్యమేనన్నారు.