కాళేశ్వరంపై పండుగ ఎందుకు చేయట్లే?

కాళేశ్వరంపై   పండుగ ఎందుకు చేయట్లే?

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కార్ గప్పాలు కొడుతుందని, మరి అక్కడ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘చెరువుల పండుగ’ ఎందుకు చేయట్లేదని బీజేపీ తమిళనాడు కోఇంచార్జీ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. అక్కరకు వచ్చే ప్రాణహితను పక్కన పెట్టి, కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల వేళ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకే నీళ్ల పండుగ చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే ప్రాజెక్టుల ఖర్చులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, రుణమాఫీ కూడా చేయని సర్కార్ కు ఉత్సవాలు చేసుకునే అర్హత లేదన్నారు. తెలంగాణ వచ్చాక ప్రాజెక్టుల కోసం రూ. 1,55,210.86 కోట్లను సర్కార్ ఖర్చు చేసిందన్నారు.

అయితే, ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ల లెక్కలన్నీ తప్పులేనన్నారు. ప్రాజెక్టుల నుంచి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారన్నదానిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రంలో 18 లక్షల బోర్లు ఉంటే.. ఇప్పుడు 26 లక్షలకు పెరిగాయని.. రాష్ట్రంలో 84 శాతం నీటి పారుదల బోర్ల ద్వారానే జరుగుతోందన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టుతో ఏపీ నీళ్ళ దోపిడీకి పాల్పడితే.. కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగాని తనం వల్లే మనకు న్యాయంగా రావాల్సిన వాటా రాకుండా పోయిందన్నారు. కాగా, ‘‘మహాజన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా ఈ నెల15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మం రానున్నారని, ఆయన పర్యటనకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు.