చర్చలు, డిబేట్లే ప్రజాస్వామ్యానికి బలం
నిరసనలలో హింసకు చోటివ్వద్దు
సిటిజన్ షిప్ ప్రొసీజర్ను మార్చలే
పార్లమెంట్లో ప్రెసిడెంట్ కోవింద్
న్యూఢిల్లీ: సిటిజన్ షిప్ సవరణ చట్టం(సీఏఏ) మహాత్ముడి ఆశయాలను నెరవేర్చేలా ఉందని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అన్నారు. దేశవిభజన తర్వాత పాకిస్తాన్లోని సిక్కులు, హిందువులు అక్కడ ఉండలేమని అనుకుంటే నిరభ్యంతరంగా ఇండియాకు రావొచ్చని మహాత్మా గాంధీ చెప్పారని ఆయన గుర్తుచేశారు. జాతిపిత ఆశయానికి కార్యరూపమే సీఏఏ అని కొనియాడారు. ఈమేరకు శుక్రవారం పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ మాట్లాడారు. చర్చలు, డిబేట్ల ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుందని, నిరసనల పేరుతో హింసకు పాల్పడితే బలహీన పడుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలో అందరికీ సమాన గౌరవం దక్కాలనేది మన దేశం పాటిస్తున్న సంప్రదాయమని అన్నారు. అయితే, దేశ విభజన టైంలోనే ఈ నమ్మకానికి తీవ్రంగా దెబ్బ తగిలిందన్నారు. పాక్లో ఉండలేక ఇండియాకు వచ్చిన హిందువులు, సిక్కులు సాధారణ జీవితం గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మహాత్మా గాంధీ చెప్పారని ప్రెసిడెంట్ గుర్తుచేశారు. సీఏఏకు ఆమోదం తెలపడం ద్వారా పార్లమెంట్ సభ్యులు గాంధీజీ స్ఫూర్తిని ఆచరణలోకి తేవడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇండియన్ సిటిజన్షిప్ను ఆశించే వారికి సంబంధించిన రూల్స్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదని కోవింద్ చెప్పారు. సిటిజన్ షిప్ పొందడానికి ఇప్పటి వరకు ఉన్న ప్రొసీజర్లో ఏ మార్పూ లేదని, ఇకపైనా ఆ రూల్స్ అలాగే ఉంటుందని అన్నారు. ఆ ప్రొసీజర్ను ఫాలో కావడం ద్వారా ప్రపంచంలోని ఏ దేశ పౌరుడైనా ఇండియన్ సిటిజన్గా మారొచ్చని కోవింద్ వివరణ ఇచ్చారు.
బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లు కట్టుకున్న ప్రతిపక్ష నేతలు
పార్లమెంట్ రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు శుక్రవారం నిరసన తెలిపాయి. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్తోపాటు 14 ప్రతిపక్షాలు బ్లాక్ఆర్మ్ బ్యాండ్లు కట్టుకుని నిరసన తెలిపాయి. ప్రెసిడెంట్ ప్రసంగిస్తున్నప్పుడు సెంట్రల్ హాల్లో ప్రతిపక్ష నేతలంతా ఒకే బ్లాక్లో కూచుకున్నారు. సీఏఏను కోవింద్ పొగుడుతున్నప్పుడు కొంతమంది ప్రతిపక్ష సభ్యులు..“షేమ్, షేమ్”అంటూ నినాదాలు చేశారు. బ్యానర్లు ప్రదర్శించారు.
నిరసనలో పాల్గొన్న పార్టీలు
కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, శివసేన, జేఎంఎం, జేడీఎస్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్(ఎం), ఐయూఎంఎల్, నేషనల్కాన్ఫరెన్స్.
సోనియా ఆధ్వర్యంలో నిరసన
రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పార్లమెంట్ కాంప్లెక్స్ గాంధీ విగ్రహం దగ్గర అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. రాహుల్గాంధీ, గులాంనబీ ఆజాద్, మోతీలాల్ ఓరా, అధిర్ రంజన్ చౌధురి, ఏకే ఆంటోనితోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. “సేవ్ కాన్స్టిట్యూషన్” స్లోగన్లు రాసున్న ప్లకార్డుల్ని పట్టుకున్నారు.
ఇంకా ఏమన్నారంటే..
మందులు, స్టెంట్లు, ఇంప్లాంట్ల ధరలు తగ్గించడం వల్ల లక్షలాది రోగులకు ప్రభుత్వం ఊరట కలిగించింది.
ఈ ఏడాది కొత్తగా అనుమతించిన 75 మెడికల్ కాలేజీల ద్వారా 16 వేల ఎంబీబీఎస్ సీట్లు, 4 వేల పీజీ సీట్లు పెరుగుతాయి.
మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 2,65,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
దేశ రక్షణకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు సైనిక బలగాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాం.
కాశ్మీర్లో టెర్రర్ యాక్టివిటీస్ తగ్గాయి.