గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పిలుపు

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పిలుపు
  •     అన్ని పోలింగ్ బూత్‌‌‌‌లలో బీజేపీని గెలిపించాలి
  •     నరేంద్ర రికార్డులను భూపేంద్ర బద్ధలు కొట్టాలని ఆకాంక్ష

వెరవల్/ధోరాజీ/అమ్రేలీ: గుజరాత్ ఎన్నికల్లో ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు వేయాలని, గత పోలింగ్ రికార్డులను బద్ధలు కొట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ బూత్‌‌‌‌లలో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. గుజరాత్‌‌‌‌లోని గిర్‌‌‌‌‌‌‌‌ సోమ్‌‌‌‌నాథ్ జిల్లాలో పర్యటించిన ఆయన.. వెరవల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అంతకుముందు సోమ్‌‌‌‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని మీడియా, పలు సర్వేలు ఇప్పటికే అంచనా వేశాయని, ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌‌‌‌ గత రికార్డులను చెరిపేస్తూ ఎక్కువ సీట్లు సాధిస్తారని తాను తరచూ వస్తున్నానని చెప్పారు. నరేంద్ర రికార్డులను భూపేంద్ర బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు. గుజరాత్‌‌‌‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం కష్టపడాలని.. ప్రజలు తమ దీవెనలు అందిస్తారని భావిస్తున్నానని అన్నారు. నేడు మొత్తం ఉత్తర భారతదేశం నుంచి సరుకులు మన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి సరఫరా అవుతున్నాయని, ఈ ఓడరేవులు ఇండియా శ్రేయస్సుకు మార్గాలుగా మారాయని అన్నారు.

నర్మదా ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తితో కలిసి పాదయాత్రనా?

నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 30 ఏండ్లపాటు అడ్డుకున్న వ్యక్తితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని, ఏ నైతిక హక్కుతో గుజరాత్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ పార్టీ ఓట్లు అడుగుతున్నదని ప్రధాని మోడీ ప్రశ్నించారు. రాజ్‌‌‌‌కోట్ జిల్లాలోని ధోరాజీలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘చాలా మంది కారణంగా నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యమైంది. కచ్, కథియవాడ్ రీజియన్ల కరువును పోగొట్టేందుకు నర్మదా ప్రాజెక్టు ఒక్కటే పరిష్కారం. కానీ, నిన్న (శనివారం) యాంటీ నర్మదా యాక్టివిస్ట్‌‌‌‌ (నర్మదా బచావ్ ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పాట్కర్)తో కలిసి కాంగ్రెస్ నేత పాదయాత్ర చేశారు. సదరు మహిళ న్యాయ పరమైన ఎన్నో అడ్డంకులు సృష్టించి నర్మదా ప్రాజెక్టును దశాబ్దాలపాటు అడ్డుకున్నారు” అని ప్రధాని మోడీ విమర్శించారు.

కాంగ్రెస్‌‌‌‌ కోసం ఓటు వేస్ట్ చేసుకోవద్దు

గుజరాత్‌‌‌‌ అభివృద్ధిపై ఎలాంటి రోడ్‌‌‌‌ మ్యాప్ లేని కాంగ్రెస్‌‌‌‌ కోసం ఓటును వృథా చేసుకోవద్దని ప్రజలను ప్రధాని కోరారు. ఆ పార్టీకి బదులుగా బీజేపీని గెలిపించాలన్నారు. అమ్రేలీ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. సౌరాష్ట్ర రీజియన్ కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదన్నారు. ‘‘కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని మీరు ఆశించలేరు. అభివృద్ధికి రోడ్‌‌‌‌మ్యాప్ ఏమిటని కాంగ్రెస్ నాయకులను మీరు అడగండి. వారి వద్ద ఎలాంటి ప్రణాళిక ఉండదు” అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో అమ్రేలీ జిల్లాలో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని, ఈ ఐదేండ్లలో వాళ్లు ఏం చేశారో చెప్పాలని మోడీ ప్రశ్నించారు. కనీసం ఒక్క పని అయినా చేశారా అని అడిగారు.