కొత్త ఇసుక  విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన

కొత్త ఇసుక  విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన

తాపీ పనిముట్లు..  బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీ

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత.. కొత్త ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన నిర్వహించారు. తాపీ పనిముట్లు చూపుతూ.. నెత్తిపై తట్ట.. బుట్టలను పెట్టుకుని..  ఇసుక బంగారం లా ఖరీదు పెరిగిందని సింబాలిక్ గా చూపుతూ.. బంగారం కొలిచే త్రాసులను పట్టుకుని ర్యాలీ నిర్వహింరు. ఒక వైపు ఇసుక కొరత.. మరో వైపు ధరల పెంపుతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారంటూ టీడీపీ నేతలు నినాదాలు చేసుకుంటూ.. కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.

30 లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారింది- శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య వల్ల 30లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు.. వారి కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారిందని  ఈ సందర్భంగా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుకను రద్దు చేసి.. కృత్రిమ కొరత సృష్టించారని విమర్శించారు. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవననిర్మాణ కార్మికులవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం.. అవినీతి విధానం అని పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పుకున్నారని..  కొత్త విధానం పై ముఖ్యమంత్రి,  మంత్రి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. సొంత మనుషులకు ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్ కి వెళ్ళిందని ఆరోపించారు. ఇప్పటికైనా మనస్సుమార్చుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది- శాసన సభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని.. నాణ్యమైన ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ.. నాసిరకం ఇసుకను రాష్ట్రంలో పంపిణీ చేస్తున్నారని  శాసన సభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. దోపిడీకి అడ్డుకట్ట పడుతుందనే ఉచిత ఇసుకను అమలు చేయట్లేదని..  మైనింగ్ మాఫియాను అడ్డుకుంటామన్నారు.

మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ .. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని నిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో  సామాన్యులే కాదు.. ఏ ఒక్కరూ ఇళ్లు కట్టుకోవడం కలగా మారిందని..  సొంతింటి  నిర్మాణం కలగా మారిన పరిస్థితి నెలకొందన్నారు.

for more News….

పత్తి చేనులో పనికోసం వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఆస్తమా పేషెంట్లకు కరోనాతో ప్రమాదమా?

జాబ్​ పోతే ఇన్సూరెన్స్​.. వీక్లీ శాలరీ రూ.లక్ష వరకు