
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ నేపథ్యంలో పోలీసులు సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ పోస్టింగ్స్ పై నిఘా ఉంచారు. ఎలక్షన్ లో సోషల్ మీడియా వేదికగా ఫేక్, కమ్యూనల్ వయొలెన్స్ ప్రచారాలు జరిగే అవకాశం ఉండడంతో వీటికి చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పార్టీలు, క్యాండిడేట్లు చేసే క్యాంపెయిన్ , వాటికి కౌంటర్ పోస్టింగ్ లపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మార్ఫింగ్ చేసి వైరల్ చేసే న్యూసెన్స్ పోస్టింగ్ డేటాను కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఐటీ సెల్, సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ తో కలిసి పోలీసులు పని చేయనున్నారు.
ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వారిపై..
ఫేక్ న్యూస్, రూమర్స్ క్రియేట్ చేసి సర్క్యూలేట్ చేసే వాళ్లపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఫేక్ న్యూస్ క్రియేషన్ చేసే వారిని, సర్క్యూలేట్ చేసే వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. మార్ఫింగ్ ఫోటోస్, వీడియోస్ తో సోషల్ వయొలేషన్కి పాల్పడే వారిని గుర్తించేందుకు టీమ్స్ ను ఫామ్ చేశారు. ఇదివరకు ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ చేసిన హిస్టరీ ఉన్నవాళ్లను స్థానిక పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. వయొలెన్స్ వీడియోలు వైరల్ చేసే వారితో పాటు అర్థరాత్రి రోడ్లపై చక్కర్లు కొట్టే వారిని పట్టుకునేందుకు ప్యాట్రో కార్, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అలర్ట్ చేశారు.
స్పెషల్ టెక్నికల్ టీమ్
సోషల్ మీడియాపై మానిటరింగ్ కు పెద్ద ఎత్తున అకౌంట్లలో పోస్టింగ్ లు చెక్ చేసేందుకు ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఐటీ సెల్, సైబర్ క్రైమ్ టీమ్స్ తో కలిసి పోలీసులు కంప్లయింట్ డేటాను కలెక్ట్ చేస్తున్నారు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వారు ఎక్కడి నుంచి ఏ అకౌంట్ ద్వారా సర్క్యూలేట్ చేస్తున్నారో గుర్తించేందుకు ఎక్స్ పర్ట్ హెల్ఫ్ తీసుకోనున్నారు. ముఖ్యంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉండే పోస్ట్ లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిటీ సౌత్జోన్లో ఎక్కువగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కమ్యూనల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి వివరాలను ఇప్పటికే సేకరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై జరిగే ప్రచారాలను స్థానిక పోలీసులు మానిటరింగ్ చేయనున్నారు.