సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి స్కూళ్లను ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ శనివారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్కు చెందిన ఎం.బాలకృష్ణ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కరోనా సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్ కూడా కాలేదన్నారు. ముఖ్యంగా పాఠశాల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తికాలేదని.. స్కూళ్ల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టకుండానే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్నారు. భౌతిక దూరం, పిల్లల హాజరు, ఆన్లైన్ తరగతుల నిలిపివేతపై స్పష్టత లేదన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపడంపై తల్లిదండ్రుల అంగీకార పత్రం అవసరమో లేదో కూడా తెలపలేదన్నారు. పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసులను తెప్పించి పరిశీలించాలని కోరారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) నివేదిక ప్రకారం సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొవిడ్ మూడోదశ ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. విద్యాశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్, నిపుణుల సలహా కమిటీలను చేర్చారు.
ఈ పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్కుమార్లతో కూడిన ధర్మాసనం ఈనెల 31న విచారణ చేపట్టనుంది.