ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్

ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
  •     ముందు జడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు
  •     వర్గ పోరు లేకుండా కాంగ్రెస్ సర్కారు ఎన్నికల వ్యూహం
  •     ఉమ్మడి జిల్లాలో 1,740 జీపీలు, 72 మండలాలు

నల్గొండ, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరంపై పడింది. జూన్​లో ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల మెటీరియల్,​ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామ పంచాయతీలు, 72 మండలాలు ఉన్నాయి. ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త చట్టం ప్రకారం రెండు టర్ముల వరకు ఒకటే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొదటి టర్మ్ కు సంబంధించి ఫిబ్రవరిలో పంచాయతీల పాలన ముగియగా, జూలైలో జిల్లా పరిషత్​ల పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి జూన్​లో ఎన్నికల నోటిఫికేషన్​ రానుంది. 

డైరెక్ట్​గా ఎన్నికల నోటిఫికేషన్​...

పంచాయతీ వార్డులు మొదలు జడ్పీ చైర్మన్​ స్థానం వరకు ఇప్పుడున్న రిజర్వేషన్లే యథావిధిగా కొనసాగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వం కొత్తగా కొన్ని మండలాలు ప్రకటించింది. వీటి విషయంలో కాంగ్రెస్​ సర్కార్​ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇవి మినహా ఇతర స్థానాల రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదు. డైరెక్ట్​గా ఎన్నికల నోటిఫికేషన్​ జారీ చేసి, వారం, పదిరోజు ల్లో ఎన్నికల ప్రచారం, నామినేషన్ల ప్రక్రియ ముగించాలని భావిస్తోంది. 

ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, కొద్ది రోజుల తేడాతో సర్పంచ్​ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల మెజార్టీ స్థానాలను కాంగ్రెస్​ కైవసం చేసుకోవడమే  కాకుండా వలసొచ్చిన నేతలతో వర్గపోరు తలెత్తకుండా ఉంటుందని జిల్లా మంత్రులు అభిప్రాయపడుతున్నారు. కష్టపడ్డ నేతలకే లోకల్​బాడీ ఎన్నికల్లో ప్రియార్టీ ఇచ్చేందుకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఇప్పటికే బంపర్​ఆఫర్​ ప్రకటించారు. 

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి పెట్టిన స్థానిక లీడర్లకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. పైగా వాళ్ల ఎన్నికల ఖర్చు కూడా తానే భరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ, సర్పంచ్​ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డారు.  నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి మండలంలో 80 శాతానికి పైగా పోలింగ్​ నమోదైంది. ఇక్కడి నుంచే ప్రస్తుత జడ్పీటీసీ పాశం రాంరెడ్డి వచ్చేసారి జడ్పీ చైర్మన్​ సీటు ఆశిస్తున్నారు. దీనిలో భాగంగానే తిప్పర్తి క్లాక్​ టవర్​ జంక్షన్​అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు కూడా మంజూరు​ చేయించారు. అదే విధంగా కనగల్​మండల జంక్షన్​ అభివృద్ధికి మరో రూ.5 కోట్లు మంత్రి కోమటిరెడ్డి మంజూరు చేయించారు. ఇలా లోకల్​బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేకుండా ఉండేందుకే ఇప్పటి నుంచే అభివృద్ధి పనులపైనే ఫోకస్​ పెట్టారు.

పక్కాగా ఎన్నికల ప్లాన్​..

ఎంపీ ఎన్నికల్లో డబుల్​ డిజిట్​ స్థానాలు కైవసం చేసుకుంటామని కాంగ్రెస్​ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే జోష్​తో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ ఐదేళ్ల వరకు ఎన్నికలు ఉండవని భావిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికలు కూడా పూర్తవుతాయి. అంతకంటే ముందే జరిగే గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్​ ఎన్నికలను కాంగ్రెస్​ పక్కాగా ప్లాన్​ చేస్తోంది. 

అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికల టైంలో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్​లో చేరారు. వీళ్లలో చాలా మంది పాత కాంగ్రెస్​ లీడర్లతోపాటు కొత్తగా బీఆర్ఎస్​ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులూ ఉన్నారు. వలసనేతలు, కరుడుగట్టిన కాంగ్రెస్​ లీడర్ల మధ్య స్థానిక ఎన్నికల్లో విభేదాలు తలెత్తకుండా ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారు. పంచాయతీ, జడ్పీ ఎన్నికలకు కలిపి ఒకటే సారి ఎన్నికల నోటిఫికేషన్​ ఇస్తే ప్రత్యర్థులకు ఛాన్స్​ ఉండదని, పైగా లోకల్​బాడీలను హస్తగతం చేసుకునేందుకు మార్గం సులువుగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.