రేపే కేబినెట్ విస్తరణ

రేపే కేబినెట్  విస్తరణ

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తన మంత్రివర్గాన్ని జూలై 4(సోమవారం)న విస్తరించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత సీఎం తన కేబినెట్ ను విస్తరిస్తున్నారు. ఐదుగురు మంత్రుల చేరికతో పంజాబ్ కేబినెట్ సంఖ్య సీఎంతో కలిపి  15 కి చేరుకోనుంది.  సునమ్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అమన్ అరోరా, జగ్రావ్ నుండి రెండుసార్లు గెలిచిన సర్వజిత్ కౌర్, తల్వాండి సబో రెండుసార్లు గెలిచిన బల్జిందర్ కౌర్,  బుధ్లాడా నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్ తో సహా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా చేరే ఎమ్మెల్యేల పేర్లపై పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.  కాగా  ఈ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలసిందే.