పుణె:టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్కు.. ఈసారి ఐపీఎల్ కలిసి రావడం లేదు. స్టార్ ప్లేయర్లున్నా.. ఎన్ని కాంబినేషన్స్ ట్రై చేసినా.. గెలుపు రుచిని మాత్రం చూడలేకపోతున్నది. తాజాగా బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లోనూ 12 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడి వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకున్నది. టాస్ ఓడిన పంజాబ్ తొలుత 20 ఓవర్లలో 198/5 స్కోరు చేసింది. శిఖర్ ధవన్ (50 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), మయాంక్ అగర్వాల్ (32 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) దంచికొడితే, చివర్లో జితేష్ శర్మ (15 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్) రెచ్చిపోయాడు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 186/9 స్కోరు మాత్రమే చేసింది. డెవాల్డ్ బ్రేవిస్ (25 బాల్స్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 49), సూర్యకుమార్ (30 బాల్స్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43) బాగా ఆడినా ఫలితం లేకపోయింది. ఒడియాన్ స్మిత్ 4 వికెట్లు తీశాడు. మయాంక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఆశలు రేపిన బ్రేవిస్.. ముంచిన రనౌట్స్
భారీ టార్గెట్ ఛేజింగ్లో ముంబైకి ఓపెనర్లు రోహిత్ (28), ఇషాన్ కిషన్ (3) సరైన ఆరంభాన్నివ్వలేదు. ఐదు ఓవర్లు కూడా ముగియకముందే 32 స్కోరు కే ఈ ఇద్దరూ పెవిలియన్కు చేరడంతో కష్టాలు మొదలయ్యాయి. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ‘బేబీ డివిలియర్స్’ డెవాల్డ్ బ్రేవిస్ ఆటతో ముంబై ఇన్నింగ్స్ మరో మెట్టు ఎక్కింది. ఆరో ఓవర్లో రెండు ఫోర్లతో టచ్లోకి వచ్చిన 18 ఏళ్ల బ్రేవిస్.. తర్వాతి ఓవర్లో సిక్సర్ బాదాడు. తర్వాతి ఓవర్లో తిలక్ వర్మ (36) రెండు ఫోర్లు కొట్టగా.. చహర్ వేసిన 9వ ఓవర్లో బ్రేవిస్ విశ్వరూపం చూపెట్టాడు. వరుసగా 4, 6, 6, 6, 6తో 29 రన్స్ పిండుకున్నాడు. ఆ వెంటనే తిలక్ వర్మ 4, 6తో పవర్ప్లేలో 42/2 ఉన్న ముంబై 10 ఓవర్లకు105/2కు చేరి రేసులోకి వచ్చింది. 11వ ఓవర్లో తిలక్ సిక్స్ కొట్టగా బ్రేవిస్ క్యాచ్ డ్రాప్తో ఫోర్ బాదాడు. ఆ వెంటనే మరో క్యాచ్ ఔట్కు బ్రేవిస్ వెనుదిరగడంతో థర్డ్ వికెట్కు 84 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కొద్దిసేపటికే తిలక్ రనౌటవడం టీమ్ను దెబ్బతీసింది. ఇక్కడి నుంచి సూర్యకుమార్, పొలార్డ్ (10) ఇన్నింగ్స్ను నడిపించారు. ఈ ఇద్దరు ఫోర్, సిక్సర్ కొట్టడంతో చివరి ఐదు ఓవర్లలో ముంబై విజయానికి 53 రన్స్ అవసరమయ్యాయి. 17వ ఓవర్లో పొలార్డ్ రనౌటైనా, సూర్య రెండు సిక్సర్లు కొట్టాడు. తర్వాతి ఓవర్లో ఐదు రన్సే రావడంతో విజయ సమీకరణం 12 బాల్స్లో 28గా మారింది. రబాడ వేసిన19వ ఓవర్లో సూర్య వెనుదిరిగాడు. లాస్ట్ ఓవర్లో ఉనాద్కట్ (12) పాటు బుమ్రా (0) ఔటవడంతో ముంబైకి మరో ఓటమి తప్పలేదు.
ఓపెనర్లు సూపర్
ముందుగా బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్లు ధవన్, మయాంక్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముంబై పేస్ అటాక్పై ఎదురుదాడి చేస్తూ.. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో మయాంక్ టచ్లోకి వస్తే, ధవన్ సిక్సర్తో దూకుడు చూపెట్టాడు. దీంతో నాలుగో ఓవర్ర్లోనే రోహిత్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్కు దింపాడు. కానీ, ఈ ఓవర్లో మయాంక్ వరుసగా 4, 4, 6తో 17 రన్స్ కొట్టాడు. దాంతో, పవర్ప్లేలో పంజాబ్ 65/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత ఈ ఇద్దరూ కాస్త నెమ్మదించారు. 9వ ఓవర్లో సిక్సర్తో మయాంక్ 30 బాల్స్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. తర్వాతి ఓవర్లో ధవన్ సిక్సర్ బాదినా, మూడో బాల్కు మయాంక్ ఔటయ్యాడు. ఫలితంగా ఫస్ట్ వికెట్కు 97 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. 10.1 ఓవర్స్లో స్కోరు 100 దాటడంతో ముంబై బౌలర్లు వికెట్లపై కన్నేశారు. ఈ క్రమంలో రన్స్ను కట్టడి చేయడంతో పాటు ఏడు బాల్స్ తేడాలో బెయిర్స్టో (12), లివింగ్స్టోన్ (2)ను ఔట్ చేశారు. ఫలితంగా ఐదు ఓవర్లలో 32 రన్సే వచ్చాయి. 37 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన ధవన్.. 4, 6 కొట్టి 17వ ఓవర్లో వెనుదిరిగాడు. ఈ టైమ్లో వచ్చిన జితేశ్ రెచ్చిపోయాడు. 18వ ఓవర్లో 6, 4, 6, 4తో 23 రన్స్ రాబడితే, లాస్ట్ ఓవర్లో షారూక్ (15) రెండు సిక్సర్లు బాదడంతో పంజాబ్ మంచి టార్గెట్ను నిర్దేశించింది. ముంబై బౌలర్లలో థంపి 2, ఉనాద్కట్, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ తీశారు.