ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆర్ కృష్ణయ్య మహాధర్నా

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆర్ కృష్ణయ్య మహాధర్నా

న్యూఢిల్లీ : బీసీలకు 50% రిజర్వేషన్  కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్‭లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బీసీలకు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ల నుంచి 50% పెంచాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న బీసీలకు ప్రమోషన్‭లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పారు. వెనుకబడ్డ అగ్రవర్ణాలకు సుప్రీంకోర్టు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇప్పటివరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ బీసీ వ్యక్తిని ప్రధానిని చేయలేదన్నారు. 

బీజేపీ పార్టీ మొదటిసారి నరేంద్ర మోడీని ప్రధానిని చేసిందని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. ట్రైబల్ కు చెందిన మహిళకి రాష్ట్రపతి పదవి ఇచ్చారని అన్నారు. బీసీ వ్యక్తి ప్రధాని అయి ఉండి బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎలా అని ప్రశ్నించారు. దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉన్నారని.. వారితోనే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. అఖండ భారత్ సాధించాలంటే బీసీలతోనే సాధ్యమని చెప్పారు. బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగేంత వరకూ పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పారు.