ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటిరోజు బ్యాటింగ్ చేసిన బంగ్లాను భారత బౌలర్లు 150 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదటి రోజు ఆట ముగిసేలోపే రోహిత్ వికెట్ను చేజార్చుకుంది. రెండో రోజు టీంఇండియా ప్లేయర్లు పుజారా, మయాంక్ అగర్వాల్ 86/1తో ఆట ప్రారంభించారు. కాసేపట్లోనే పుజారా అవుటవడంతో.. కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఆ తర్వాత రహానే బ్యాటింగ్కి దిగాడు. వికెట్ల మధ్య ఒక్కో రన్ రాబడుతూ రహానే 25 పరుగులు పూర్తి చేసి టెస్ట్ కెరీర్లో 4000 పరుగుల క్లబ్లో చేరాడు. 4000 పరుగుల క్లబ్లో చేరిన 16వ ఆటగాడిగా రహానే నిలిచాడు. అయితే ఈ క్లబ్లో చేరడానికి వెంగ్ సర్కార్ 114, ధోని 116, కపిల్ దేవ్ 138 ఇన్నింగ్స్ తీసుకున్నారు. రహానే మాత్రం 104 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు 101 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన వారిలో గంగూలీ, లక్ష్మణ్ ఉన్నారు.
మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి


