
పేద ప్రజలకు సొంతింటి కల దూరం
న్యూఢిల్లీ: నగరాల్లో ఇండ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఆదాయపరంగా ఉన్నత స్థితిలో ఉన్న 5 శాతం ఫ్యామిలీలు కూడా ముంబైలో ఇల్లు కొనడానికి వందేండ్లకు పైగా పొదుపు చేయాలని చెబుతున్న ఓ నివేదికను రాహుల్ పోస్టు చేశారు. ‘అవును.. ముంబైలో ఇల్లు కొనడానికి ఇండియాలోని అత్యంత ధనిక 5 శాతం మంది కూడా 109 ఏండ్లు ఆదాయంలో 30 శాతం ఆదా చేసుకోవాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.
అన్ని మెట్రో నగరాల్లో పరిస్థితి ఇలాగే ఉందన్నారు. కనీస అవసరాల కోసం పనిచేసే పేదలు అంత మొత్తం ఎలా పొదుపు చేసుకోగలుగుతారన్నారు. పేద, మధ్యతరగతి వారికి వారసత్వంగా సంపద రాదని, బాధ్యతలే వస్తాయన్నారు. సంపన్నులకే సొంత ఇల్లు కల అయినప్పుడు.. పేదల కల ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు.