
ముంబై: మహారాష్ట్ర పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉప్పు నిప్పులా ఉంటున్న థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థ్రాకే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే కలిసిపోయారు. ఇద్దరు కలిసి ఒకే అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పని సరిగా విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2025 జూలై 5న ఉద్ధవ్, ఠాక్రే రాజ్ ఠాక్రే సంయుక్తంగా నిరసన ప్రదర్శనకు దిగనున్నారు.
ఈ విషయాన్ని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ అధికారికంగా వెల్లడించారు. శుక్రవారం (జూన్ 27) రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఐక్య ఫ్రంట్ పేరుతో ఉద్ధవ్ థ్రాకే, రాజ్ థాక్రే నేతృత్వంలో మహారాష్ట్ర ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పని సరిగా విధించడాన్ని వ్యతిరేకిస్తూ 2025 జూలై 5న సంయుక్తంగా నిరసన ప్రదర్శన చేస్తామని తెలిపారు. ఐక్య ఫ్రంట్ రాజకీయ రహితంగా ఉంటుందని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో మరాఠీ ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.
►ALSO READ | జగన్నాథుని రథ చక్రాలు కదిలాయి : 10 లక్షల మంది భక్తులతో జన సందోహం..
హిందీకి మేం వ్యతిరేకం కాదు. కానీ పాఠశాలల్లో చిన్న పిల్లలపై దీనిని రుద్దుతున్నారు. అది ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో భాషను బలవంతంగా ఉపయోగించకూడదు అని రౌత్ పేర్కొన్నారు. నిరసన విషయం తొలుత భిన్నాభిప్రాయాలు వచ్చాయని.. మొదట రాజ్ థాక్రే జూలై 6న, ఉద్ధవ్ థాక్రే జూలై 7 ఆందోళనలు చేపట్టాలనుకున్నారని తెలిపారు. కానీ బలమైన సందేశం ఇవ్వడం కోసం ఇరు వర్గాలు చర్చించుకుని జూలై 5న ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
అయితే.. ర్యాలీ సమయం, స్థానం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. దీనిపై మరోసారి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది రాజకీయాల గురించి కాదని.. మరాఠా భాష, మహారాష్ట్ర పిల్లల హక్కుల గురించి అని రౌత్ పేర్కొన్నారు. చాలా ఏండ్ల తర్వాత థాక్రే బ్రదర్స్ కలిసి ఆందోళన దిగనుండటంతో ఈ ర్యాలీపై మహా పాలిటిక్స్లో ఆసక్తి నెలకొంది.