పెద్దపులికి ఘనంగా అంత్యక్రియలు..వేలాది మంది అభిమానులు, పర్యాటకుల నివాళి

పెద్దపులికి  ఘనంగా అంత్యక్రియలు..వేలాది మంది అభిమానులు, పర్యాటకుల నివాళి

మనుషులకు అంత్యక్రియలు నిర్వహించడం సాధారణం..అప్పుడప్పుడు తమకు ఇష్టమైన పెంపుడు జంతువులకు కూడా అంత్యక్రియలు నిర్వహించడం కూడా చూస్తుంటాం.. అయితే పెద్దపులికి అంత్యక్రియలు చేయడం ఎప్పుడైనా చూశారా..? ఇక్కడో ఓ ఫేమస్ పెద్దపులికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. ఆ పులికి వీడ్కోలు పలికేందుకు దాని అభిమానులు, ఫొటోగ్రాఫర్లు, ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ పెద్ద పులికి ఉన్న ప్రత్యేకతలేంటీ.. అంతమంది అభిమానులను ఎలా సంపాదించింది. ఎలా చనిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..  

రణతంబోర్ అభయారణ్యం రాజస్థాన్ రాష్ట్రంలో సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉంది. ఇది ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద ,ప్రసిద్ధ జాతీయ పార్కులలో ఒకటి. రణతంబోర్ అభయారణ్యంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆడపులి ఆరోహెడ్ (T-84) జూన్ 19న మరణించింది. అభయారణ్య నిబంధనల ప్రకారం ఆరోహెడ్ కు అంత్యక్రియలు నిర్వహించారు అధికారులు. 

11 యేళ్ల వయసున్న ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయింది. జోగి మహల్ సమీపంలో ఆరోహెడ్ మృతదేహాన్ని గుర్తించిన అధికారులు.. రాజ్‌బాగ్‌లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రోటోకాల్స్ ప్రకారం దహనం చేశారు. ఈ అంత్యక్రియలకు ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌లు, పర్యాటకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఆరోహెడ్.. రణతంబోర్లో అత్యంత ఫోటోలు తీసిన పులులలో ఒకటి. ఇది రణతంబోర్ "రాణి"గా పేరుగాంచిన ప్రసిద్ధ ఆడపులి మచ్లీ (T-16) మనవరాలు. ఆరోహెడ్ తన తల్లి కృష్ణ (T-19) మాదిరిగానే ధైర్యం, వేటాడే నైపుణ్యాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా మొసళ్లను వేటాడడంలో ఆరోహెడ్ ప్రసిద్ధి. 

►ALSO READ | Big Breaking : చైనా గబ్బిలాల్లో ప్రాణాంతక 20 వైరస్లు:వీటిలో రెండు కోవిడ్ కంటే ప్రమాదకరం

ఆరోహెడ్ తన జీవితకాలంలో నాలుగు సార్లు పిల్లలను కన్నది. మొత్తం 10 పిల్లలకు జన్మనిచ్చింది. దీని సంతానం రణతంబోర్ ,ఇతర పులుల సంరక్షణ కేంద్రాల్లో పులుల సంఖ్యను పెంచడంలో సహాయపడింది. ఆరోహెడ్ చిన్న కూతురు కంకటిని (T-2507) ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్‌కు తరలించిన కొద్ది గంటల్లోనే అది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 

ఆరోహెడ్ మరణం రణతంబోర్‌కు ఒక శకం ముగిసినట్లుగా భావిస్తున్నారు. ఆమె వన్యప్రాణి సంరక్షణకు ఒక చిహ్నంగా రణతంబోర్ కథలో కీలక భాగంగా నిలిచిపోయిందన్నారు. ఆరోహెడ్ వారసత్వం దాని  పిల్లల ద్వారా కొనసాగుతుందంటున్నారు అధికారులు.