
బెంగుళూర్: బెంగుళూర్ తొక్కిసలాట కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ కోచ్ నిఖిల్ సోసలేకు ఊరట దక్కింది. ఈ కేసులో నిఖిల్ సోసలేకు కర్నాటక హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిఖిల్ సోసలేతో పాటు ఇద్దరు డీఎన్ఏ నెట్వర్క్స్ అధికారులకు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. పాస్పోర్ట్ సరెండర్తో సహా పలు షరతులతో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా జైల్లో ఉన్న నిందితులు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు వారం రోజుల తర్వాత బయటకు రానున్నారు.
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో జూన్ 4న బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించారు. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది క్రికెట్ ఫ్యాన్స్ చనిపోయిన విషయం తెలిసింది. ఈ తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోని మార్కెటింగ్ హెడ్ నిఖిల్ కారణం అంటూ కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ | ENG vs IND 2025: గౌతమ్ గంభీర్ తల్లికి గుండెపోటు.. స్వదేశానికి టీమిండియా హెడ్ కోచ్
ఆ వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. స్టేడియంలో RCB విజయోత్సవం ఉంటుంది.. ఎవరైనా రావొచ్చు.. టికెట్ లేదు ఫ్రీ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఈ నిఖిల్ అని విచారణలో పోలీసులు తేల్చారు. నిఖిల్ పెట్టిన ఒక్క పోస్ట్ కారణంగా.. 35 వేల కెపాసిటీ ఉన్న స్టేడియానికి.. 3 లక్షల మంది తరలివచ్చారు.
ఇసుకేస్తే రాలనంత జనం తరలిరావటంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. దీని అంతటికి కారణం RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ అంటూ పోలీసులు కేసు పెట్టి.. అరెస్ట్ చేసేశారు. ఈ క్రమంలోనే తనకు బెయిల్ ఇవ్వాలంటూ నిఖిల్ సోసలే కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. నిఖిల్ బెయిల్ పిటిషన్ పై శుక్రవారం (జూన్ 13) విచారణ చేపట్టిన హైకోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.