
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇండియాకు పయనం అయ్యాడు. గంభీర్ తల్లి సీమా గుండెపోటుతో ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబంతో కలిసి ఉండటానికి భారత జట్టు ప్రధాన కోచ్ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంగ్లీష్ జట్టుతో 5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ లో ఉన్న గంభీర్.. తన తల్లికి అనారోగ్యం కారణంగా ఇండియాకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో జరగబోయే 5మ్యాచ్ ల సిరీస్ కు ముందు గురువారం (జూన్ 12) కెంట్ లోని బెకెన్ హామ్ లో జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో భారత జట్టుతో గంభీర్ లేడని పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి.
ఇంగ్లాండ్తో భారత్ తమ తొలి టెస్టు జూన్ 20 న ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్ కు జరగబోయే మూడు రోజుల ముందు అనగా.. మంగళవారం (జూన్ 17) గంభీర్ తిరిగి భారత శిబిరంలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో శుక్రవారం (జూన్ 13) కెంట్లో ప్రారంభమయ్యే భారత ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ చూడటానికి 43 ఏళ్ల గంభీర్ అందుబాటులో ఉండట్లేదు. బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ నాలుగు రోజుల పాటు జరగబోయే ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉంటారు. ఈ మ్యాచ్లో ఆటగాళ్ళు ఎలా రాణిస్తారో గమనించి.. గంభీర్ యునైటెడ్ కింగ్డమ్కు తిరిగి వచ్చిన తర్వాత అతనికి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు.
ఇండియా ఎ జట్టు తరఫున ఆడుతున్న ఎనిమిది మంది సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్ లయన్స్తో రెండు వార్మప్ మ్యాచ్లు ఆడారు. రెండ టెస్ట్ మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. టెస్ట్ సిరీస్కు ముందు గంభీర్, కొత్త కెప్టెన్ శుభ్మాన్ గిల్ తుది జట్టును అంచనా వేయడానికి ఈ మ్యాచ్ ఆటగాళ్లకు కీలకం కానుంది. కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, యశస్వి జైస్వాల్ ఇంట్రా-స్క్వాడ్ గేమ్లో ఎక్కడ ఆడతారో ఇంకా తెలియలేదు.