మార్చి 21 నుంచి  మహా సుదర్శన యాగం

మార్చి 21 నుంచి  మహా సుదర్శన యాగం
  • ఆరు వేల మంది రుత్విక్కులతో నిర్వహిస్తాం
  • ప్రతి రోజూ లక్ష మందికి భోజనం
  • యాదాద్రి టెంపుల్ 99 శాతం పూర్తయింది
  • వ్యయం మరో రూ.300 కోట్లు పెరగొచ్చు
  • దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి టెంపుల్​పనులు 99 శాతం పూర్తయ్యాయని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. మార్చి 21 నుంచి 28 వరకు మహాసుదర్శన యాగం జరుగుతుందని, తర్వాత దర్శనాలకు అనుమతిస్తామన్నారు. యాదాద్రి టెంపుల్​మహాకుంభ సంప్రోక్షణకు గడువు దగ్గర పడుతుండడంతో మంత్రి శుక్రవారం పర్యటించి టెంపుల్​డెవలప్​మెంట్​వర్క్స్​పరిశీలించారు. తర్వాత వైటీడీఏ వైస్​చైర్మన్​కిషన్​రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్​ సాయిని వివరాలడిగి తెలుసుకున్నారు.  తర్వాత మీడియాతో మాట్లాడుతూ  మార్చి 21 నుంచి మహా సుదర్శన యాగం, 28న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 75 ఎకరాల్లో 6 వేల మంది రుత్విక్కులతో నిర్వహించే1008 కుండలాలతో చేసే యాగానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. నెలాఖరుకు సప్త గోపురాలపై బంగారు కలశాల బిగింపు పూర్తవుతుందన్నారు. ఎంట్రీ ఫ్లైఓవర్​బ్రిడ్జికి సంబంధించిన కేబుల్​ను లండన్​ నుంచి షిప్​లో తెప్పిస్తున్నామన్నారు. దీని పనులు అనుకున్న టైంలో పూర్తి కాకున్నా పైకి వెళ్లడానికి వేరే రూట్​రెడీగా ఉందన్నారు. ఇప్పటికే ప్రెసిడెన్సియల్ సూట్ పూర్తయ్యిందని, క్యూకాంప్లెక్స్, కల్యాణకట్ట, దీక్షపరుల మండపం పనులు నెలాఖరు వరకు కంప్లీట్ అవుతాయని చెప్పారు.  రోడ్డు వెడల్పుకారణంగా కోల్పోయిన షాపులను మార్చిలోగా నిర్మిస్తామన్నారు. టెంపుల్​పనులన్నీ మార్చి 20 లోపే పూర్తవుతాయని, ఏవైనా మిగిలితే మహాకుంభ సంప్రోక్షణం తర్వాత జరుగుతాయన్నారు. 21 నుంచి 28 వరకు రోజూ లక్ష మంది భక్తులకు భోజనాలు పెడతామన్నారు. 1200 కోట్లతో ఇంత పెద్ద నిర్మాణమైనందున మార్పులు చేర్పులకు అవకాశం ఉందని, నిర్మాణ వ్యయం రూ.1500 కోట్లు కావచ్చన్నారు.

మంత్రిని అడ్డుకున్న వ్యాపారులు

కొండపై తమకు షాపులను నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రిలో వ్యాపారులు మంత్రిని అడ్డుకున్నారు. నిర్మాణాలను పరిశీలించి తిరిగి వెళ్లడానికి  టెంపుల్​ ఈఓ ఆఫీసు వద్దకు రాగానే అక్కడున్న వ్యాపారులు షాపులను కొండపైనే నిర్మించి ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. మంత్రి సమాధానం ఇస్తేనే కదులుతామని చెప్పడంతో మినిస్టర్​వచ్చారు. షాపుల గురించి సీఎంతో మాట్లాడి, రెండ్రోజుల్లో క్లారిటీ ఇస్తానని చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. 

సమ్మక్క సారక్క జాతరపై ఆలోచిస్తాం  

కరోనా కారణంగా సమ్మక్క సారక్క జాతరపై నిర్ణయం తీసుకునే అవకాశముందని మంత్రి తెలిపారు. ఇప్పటికే జాతరపై రివ్యూ చేశామని, పనులు కూడా సాగుతున్నాయన్నారు. ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడం, కరోనా కేసులు పెరుగుతున్నందున జాతరపై ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు.