ఇంటర్ కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్

ఇంటర్  కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎట్టకేలకు ఇంటర్  కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరైజ్  అయ్యారు. జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ వారంతా జాయినింగ్  ఆర్డర్లు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్​లో 2,909 మంది రెగ్యులర్, 184 మంది ఒకేషనల్ లెక్చరర్లతో పాటు ముగ్గురు సీనియర్ ఇన్ స్ర్టక్టర్లను క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం కాంట్రాక్టు లెక్చరర్లకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్  అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో సాయంత్రం నుంచి కాంట్రాక్టు లెక్చరర్లు జాయినింగ్ ఆర్డర్స్ అందుకోగా, మిగిలిన జిల్లాల్లో అర్ధరాత్రి వరకూ వాటిని తీసుకున్నారు. రెగ్యులరైజేషన్  ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా డీఐఈఓ ఆఫీసులకు ఉదయమే రావాలని కాలేజీ ప్రిన్సిపల్స్, కాంట్రాక్టు లెక్చరర్లను ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లో ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు ఉదయమే అక్కడికి చేరుకున్నారు. కానీ, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2కు ఆర్జేడీ అధికారి ఒక్కరే ఉండటం, ఆమె హైదరాబాద్​లో ఉండటంతో డీఐఈఓ, జిల్లా నోడల్ ఆఫీసర్లు అపాయింట్మెంట్  ఆర్డర్లను తీసుకుపోయేందుకు హైదరాబాద్​కు వచ్చారు. వ్యక్తిగత ఆర్డర్లపై ఆర్జేడీ సంతకాలు చేయాల్సి ఉండడంతో ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్  నుంచి జిల్లాలకు డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లు వచ్చేందుకు అర్ధరాత్రి వరకూ టైమ్ అయింది. దీంతో ప్రిన్సిపల్స్, కాంట్రాక్టు లెక్చరర్లు  పొద్దంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. డీఐఈఓలు ప్రిన్సిపాల్స్  ద్వారా కాంట్రాక్టు లెక్చరర్లకు జాయినింగ్   ఆర్డర్స్ అందించారు. అయితే, 3న రెగ్యులరైజేషన్ ఆర్డర్స్, 4న జాయిన్  అయినట్లు ఉత్తర్వులిచ్చారని తెలిసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తుది తీర్పుకు లోబడి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి, గుట్టుచాటుగా ఇంటర్​ అధికారులు అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఓయూ జేఏసీ నేతలు గురువారం అర్ధరాత్రి కమిషరేట్  వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్​కు తరలించారు.