- 63 రోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకుంటలేరనే..
- నెల జీతం, సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్
- సర్ధి చెప్పి దింపిన మహదేవపూర్ తహసీల్దార్
మహదేవపూర్, వెలుగు: ‘పనిజేసిన పైసలు నెలనెల టైంకు ఇస్తూ..సమాన పనికి సమాన జీతం ఇయ్యాలె అని 63 రోజులుగా నిరసన తెలియజేస్తుంటే సర్కారు పట్టించుకుంట లేదు’ అని ఆశ్రమ హాస్టళ్లలో వంట చేసే డెయిలీ వేజ్వర్కర్లు వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లోని వివిధ హాస్టళ్లలో వంట చేసే డెయిలీ వేజ్వర్కర్లు రెండు నెలలుగా నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం నలుగురు వర్కర్లు మహదేవపూర్ లోని ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో ఎస్ఐ రాజ్ కుమార్, తహసీల్దార్శ్రీనివాస్ అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పి కిందికి దింపారు.
వర్కర్లు మాట్లాడుతూ ‘మేమేం అడిగినం సారూ.. చేసిన పనికి తగ్గ జీతం అడిగినం, ఇప్పుడిచ్చె జీతాన్ని యే నెలకా నెల ఇవ్వమన్నం. ఎప్పుడో లాక్ డౌన్ ల ఇయ్యాల్సిన ఎనిమిది నెలల పైసలు ఇప్పటికీ ఇస్తలేరు. రెండు నెలల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకుంటలేరు. తెలంగాణా సర్కార్ల మా పానాలకు విలువ లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.