
- రాహుల్ను ప్రధానిని చేసుకొని చట్టాన్ని సవరించుకుందాం: సీఎం
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి
- దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహానేత అని వెల్లడి
- రాజీవ్ జయంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: రాజీవ్గాంధీ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏండ్లు నిండిన వాళ్లు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ‘‘ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునేవరకు విశ్రమించబోం. యువత రాజకీయాల్లో, చట్టసభల్లోకి వచ్చేలా చూస్తం” అని తెలిపారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటేరియెట్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ స్ఫూర్తితోనే సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటివి చేపట్టామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించిన మహానేత రాజీవ్ గాంధీ అని తెలిపారు. ‘‘పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేసి కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేశారు. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడింది” అని సీఎం పేర్కొన్నారు.