
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత పీవీకే దక్కుతుందన్నారు. నాడు ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నదని చెప్పారు.
విద్యా వ్యవస్థలో వినూత్న విధానాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నెలకొల్పి గురుకుల విద్యకు తొలి అడుగులు వేశారన్నారు. పీవీ స్ఫూర్తితోనే రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది సీఎం రేవంత్ పేర్కొన్నారు.