రోడ్డు ప్రమాదం… తండ్రి కళ్లెదుటే ఇంటర్ విద్యార్థిని దుర్మరణం

రోడ్డు ప్రమాదం… తండ్రి కళ్లెదుటే ఇంటర్ విద్యార్థిని దుర్మరణం

మేడ్చల్ , వెలుగు: రోడ్డు ప్రమాదంలో యువతి చనిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ కు చెందిన మురళి గౌడ్ తన కూతురు మేఘన(17)ను బాచుపల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చేర్పించాడు. వేసవి సెలవులు రావడంతో ఇంటికి తీసుకెళ్తున్నాడు. మేడ్చల్ వద్దకు రాగానే రేకులబాయి మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి జాతీయ రహదారి రెయిలింగ్​ను ఢీకొట్టింది. రెయిలింగ్​కారు ముందు అద్దం నుండి వెనుక భాగం వైపు చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముందు భాగంలో కూర్చున్న మేఘన అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి మురళి, డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాయుడు చెప్పారు.