న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో కీలకమైన ఐదో టెస్ట్కు ముందు ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరోనా బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్కు దూరం కానున్నాడు. బుధవారం రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్లోనూ హిట్మ్యాన్కు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో అతను హోటల్ రూమ్లోనే ఐసోలేషన్లో ఉన్నాడు. రోహిత్ గైర్హాజరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ మ్యాచ్కు స్టాండిన్ కెప్టెన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దాంతో, 35 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్ట్ టీమ్ను నడిపించనున్న తొలి పేసర్గా బుమ్రా రికార్డులకెక్కనున్నాడు. 1987లో కపిల్ దేవ్ కెప్టెన్సీ తర్వాత ఒక్క పేసర్ కూడా సారథ్యం వహించలేదు. రోహిత్ దూరమైతే ఈ ఫార్మాట్లో ఇండియాకు బుమ్రా 36వ కెప్టెన్ అవుతాడు. ఇప్పటివరకు కెరీర్లో 29 టెస్ట్లు ఆడిన బుమ్రా 123 వికెట్లు తీయడంతో పాటు వరల్డ్ బెస్ట్ బౌలర్గా ఎదిగాడు. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ.. బర్మింగ్హామ్ చేరుకున్న తర్వాత ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్లోనే టీమ్ మీటింగ్ ఏర్పాటు చేశాక రోహిత్ గైర్హాజరీ విషయం బయటకు వచ్చింది. కానీ, బోర్డు నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
ఇంకా టైమ్ ఉంది: ద్రవిడ్
రోహిత్ గైర్హాజరీపై చీఫ్ కోచ్ ద్రవిడ్ భిన్నమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. టెస్ట్కు మరో 36 గంటల టైమ్ ఉంది కాబట్టి ఆ లోగా ఏదైనా జరగొచ్చని బుధవారం మీడియా సమావేశంలో చెప్పాడు. ‘రోహిత్ను మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. ఇప్పటికైతే తను పూర్తిగా దూరం కాలేదు. టీమ్లోకి రావాలంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాలి. గురువారం ఉదయం చేసే టెస్టు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. మెడికల్, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఏం చెబుతాయో చూద్దాం. ఇప్పటికైతే ఏదీ ఫైనల్ కాలేదు’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
ఓపెనర్గా ఎవరు?
కెప్టెన్గా, బ్యాటర్గా రోహిత్ ఈ మ్యాచ్కు దూరం అయితే ఓపెనర్గా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది. కేఎల్ రాహుల్ కూడా లేకపోవడంతో.. చతేశ్వర్ పుజారా, హనుమ విహారిలో ఒకర్ని ఓపెనర్గా పంపే చాన్స్ ఉంది. అయితే గిల్కు జోడీగా సీనియర్ పుజారా అయితేనే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. రోహిత్కు కవర్గా మయాంక్ను పంపినా.. అతన్ని తుది జట్టులోకి తీసుకోవడానికి మేనేజ్మెంట్ ఆసక్తి చూపడం లేదు. ‘మయాంక్ కేవలం ప్రత్యామ్నాయంగా వెళ్లాడు. పుజారా–గిల్ కాంబినేషన్ బాగుంటుంది. 2018- సిరీస్లో విహారి కూడా ఆసీస్పై ఓపెనింగ్ బాగా చేశాడు. కాబట్టి అతన్ని కూడా ఓ ప్రత్యామ్నాయంగా భావించొచ్చు. కానీ పుజారాకే చాన్స్ ఎక్కువగా ఉంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు. ఫైనల్ ఎలెవన్లో బ్యాటర్లుగా పుజారా, గిల్, కోహ్లీ, శ్రేయస్, విహారి, పంత్కు చోటు కచ్చితంగా కనిపిస్తున్నది. అయితే నాలుగో బౌలర్గా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను తీసుకుంటారా? లేక రెండో స్పిన్నర్గా అశ్విన్ వైపు మొగ్గు చూపుతారా? అన్నది తేలాలి. ఏకైక స్పిన్నర్గా జడేజా, పేసర్లుగా బుమ్రా, షమీ కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. మూడో పేసర్గా హైదరాబాదీ సిరాజ్ వద్దనుకుంటే ఉమేశ్ టీమ్లోకి వస్తాడు.
ఐర్లాండ్పై ఆడిన టీమ్తోనే
జులై 7న ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20కి ఐర్లాండ్తో ఆడిన టీమ్నే బరిలోకి దించనున్నారు. జులై 5న టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్లకు మూడు రోజుల విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. తర్వాతి రెండు మ్యాచ్లకు రోహిత్, కోహ్లీ, పంత్ తిరిగి జట్టులోకి రానున్నారు.