
వికారాబాద్, వెలుగు : జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. అంగన్ వాడీలకు నెలవారీగా సరఫరా చేసే గుడ్లు సక్రమంగా ఉండడంలేదు. కుళ్లిన గుడ్లను సప్లై చేయగా.. ఇంటికి తీసుకుపోయి అనుమానంతో వాటిని గుడ్లను పగలగొట్టి చూడగా కుళ్లిపోయి దుర్వాసన వచ్చాయి. దీంతో గర్భిణులు, బాలింతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి గుడ్లు తింటే ఆరోగ్యంగా ఎలా ఉంటామని ప్రశ్నించారు. 15 రోజుల కిందట గర్భిణులకు కోడిగుడ్లను ఐసీడీఎస్ సిబ్బంది పంపిణీ చేసిన ఘటన వికారాబాద్ జిల్లా నవాబు పేట మండలంలోని ఎల్లకొండలో జరిగింది.
తమకేదైనా అయితే..?
అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ లోగో తో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. కాంట్రాక్టర్లు మాత్రం కుళ్లిన , చిన్న సైజు గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఎల్లకొండలోని అంగన్ వాడీ సెంటర్ కు కుళ్లిన, చిన్న కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేశారు. కొందరు గర్భిణులు, బాలింతలు ఇంటికి తీసుకెళ్లి ఉడకబెట్టగా దుర్వాసన రావడంతో వాటిని పారవేశారు. కొందరు తిరిగి అంగన్ వాడీ సెంటర్ కు తీసుకొచ్చారు. ఈ కుళ్లిన గుడ్లు మాకు ఎందుకు అంటూ పలువురు గర్భిణులు, బాలింతలు ప్రశ్నించారు. తమకేదైనా అయితే బాధ్యులు ఎవరని నిలదీశారు. పై నుంచి ఇస్తున్నారని, తామేం చేస్తామని అంగన్ వాడీ టీచర్లు చెబుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడమే లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు అంగన్వాడీ సెంటర్లను తనిఖీలు చేయాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.