
- జరిగినట్లు అధికారుల అనుమానం
భోపాల్: మధ్యప్రదేశ్లో మరో భారీ స్కామ్ బయటపడింది. 50 వేల మంది "ఘోస్ట్ ఎంప్లాయీస్" (రికార్డుల్లో మాత్రమే ఉండే పేర్లు) పేరుతో సుమారు రూ.230 కోట్ల శాలరీ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని 50 వేల మంది (9% మంది) ఉద్యోగులకు గత ఆరు నెలలుగా (డిసెంబర్ 2024 నుంచి) జీతాలు ఇవ్వడం లేదు.
ఉద్యోగుల పేర్లు, ఎంప్లాయ్ కోడ్లు అధికారిక రికార్డుల్లో ఉన్నా.. వారికి జీతాలు మాత్రం అందకపోవడం గందరగోళానికి దారితీసింది. దాంతో వీరంతా "ఘోస్ట్ ఎంప్లాయీస్" అని, వారి పేరుతో జీతాల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ.230 కోట్ల స్కామ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీనిపై మధ్యప్రదేశ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే 6 వేల మంది డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (డీడీవో)కు లేఖలు పంపింది.
ఈ 50 వేల మంది ఉద్యోగులు అసలు ఎవరు? వారికి జీతాలు అందకపోవడానికి కారణాలు ఏంటి? సెలవుల్లో ఉన్నారా? సస్పెండ్ అయ్యారా? లేదా వారు నిజంగానే ఘోస్ట్ ఎంప్లాయీసా? తేల్చాలని స్పష్టం చేసింది. రూ.230 కోట్ల మోసం జరిగిందా? లేదా? అనేది కూడా పూర్తి వివరాలతో 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని డీడీవోలను ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా వెరిఫికేషన్ డ్రైవ్ను నిర్వహించి ఫేక్ ఉద్యోగులను పట్టుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. డీడీవోల నుంచి రిప్లై వచ్చిన తర్వాత ఘోస్ట్ ఎంప్లాయీస్, ఆర్థిక దుర్వినియోగంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కుంభకోణం ఆరోపణలపై మంత్రి జగదీశ్ దేవ్దా క్లుప్తంగా స్పందించారు. అన్ని ప్రక్రియలు నిబంధనల ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు.