ఫామ్​హౌస్​లకు అద్దాల రోడ్లు.. జనాలకు గుంతల రోడ్లా?

ఫామ్​హౌస్​లకు అద్దాల రోడ్లు.. జనాలకు గుంతల రోడ్లా?
  • మౌలిక సౌకర్యాల కల్పనలో రాష్ట్ర సర్కారు విఫలం 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్​కుమార్  ఫైర్

కాగజ్ నగర్, వెలుగు:  సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు, ఫామ్ హౌస్​లకు అద్దాల్లాంటి రోడ్లు వేసుకుని జనాలకు మాత్రం గుంతల రోడ్లు వేశారని  బీఎస్పీ  స్టేట్​ చీఫ్​ డాక్టర్  ఆర్​.ఎస్.ప్రవీణ్ కుమార్  విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ ​జిల్లా కాగజ్ నగర్  పట్టణంలోని రాజీవ్​ గాంధీ చౌరస్తా నుంచి అంబేద్కర్  చౌరస్తా వరకు అర్ధంతరంగా నిలిచిపోయిన రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఈస్ గాం బెంగాలీ క్యాంప్ లో పర్యటించారు. అక్కడ పార్టీ ఆఫీసును ప్రారంభించి మాట్లాడారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలమయంగా మారినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని, ఇదేనా రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ తో జరిగిన అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్  ప్రభుత్వం సిర్పూర్  సహా వెనుకబడిన ప్రాంతంపై వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. కాగజ్ నగర్  అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కృషి చేయడం లేదన్నారు. రూ.కోటి రూపాయలు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. కాగజ్ నగర్  మున్సిపాలిటీ టౌన్ లో గుంతల రోడ్లు ఉంటే ఇక పల్లెల్లో రోడ్ల గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే ఎమ్మెల్యే కోనప్ప మంత్రి కేటీఆర్ ను  కలిసి రూ.100 కోట్లు మంజూరు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఎస్పీకి ప్రజలు  అండగా నిలవాలని కోరారు. ఆర్ఎస్  వెంట పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అర్షద్  హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిదం గణపతి ఉన్నారు.