హైదరాబాద్ లో RSS పథసంచలన్ కార్యక్రమం మొదలైంది. విజయసంకల్ప్ శిబిరంలో భాగంగా ఇవాళ సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ జరగనుంది. సభ కంటే ముందు సిటీలోని నాలుగు ప్రాంతాల నుంచి స్వయంసేవకుల పథసంచలన్ కార్యక్రమం మొదలైంది. మన్సూరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ సెంటర్, వనస్థలిపురం లలితా గార్డెన్స్, సరూర్ నగర్ మండల కార్యాలయం, హస్తినాపురం రామిరెడ్డి గార్డెన్స్ నుంచి మొదలైన రూట్ మార్చ్.. ఒకేసారి ఎల్ బీ నగర్ చౌరస్తాలో కలుసుకున్నాయి.అక్కడి నుంచి అంతాకలిసి బహిరంగసభ జరిగే సరూర్ నగర్ స్టేడియంకు చేరుకోనున్నారు.
సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభలో RSS సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రధానోపన్యాసం చేయనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త BVR మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బహిరంగసభలో దాదాపు పాతికవేల మంది పాల్గొంటారని అంచనా. మూడు రోజుల పాటు జరిగే శిబిరం రేపు ముగియనుంది.
మొదటి రోజు సమావేశానికి 8 వేల మంది సంఘ్ సభ్యులు హాజరయ్యారు. 34 RSS అనుబంధ సంఘాలు శిబిరానికి వచ్చాయి. అయితే మీడియా ప్రచారానికి దూరంగా ఉండే RSS.. ఈసారి మాత్రం కొద్దిసేపు మీడియాను లోపలికి అనుమతించింది.