- హార్మూజ్, బోస్ఫరస్పై ఆధారపడడం తగ్గించుకోవాలి
- రష్యా డిప్యూటీ ప్రధాని మరాత్ ఖుస్నులిన్ వ్యాఖ్య
- ఆయిల్, గ్యాస్రవాణాకు అడ్డంకుల నేపథ్యంలో యోచన
- ఏర్పాటైతే జియోపోలిటికల్గా పలు మార్పులు
మాస్కో: హార్మూజ్, బోస్ఫరస్ జలసంధులపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని రష్యా భావిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రష్యా డిప్యూటీ ప్రధాని మరాత్ ఖుస్నులిన్ అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలతో హార్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాధారణ పరిస్థితుల్లో ప్రపంచ ఇంధన సరఫరాల్లో దాదాపు ఐదో వంతు హార్మూజ్ జలసంధి మీదుగానే జరుగుతుంది. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఖుస్నులిన్ సూచించారు. భారత్కు చేరుకునే అవకాశం కల్పించే ఏ మార్గమైనా తమకు ఆమోదయోగ్యమేనని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్కు తెలిపారు.
పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్తో హార్మూజ్ జలసంధి కలుపుతోంది. నల్ల సముద్రాన్ని మార్మరా సముద్రంతో బోస్ఫరస్ జలసంధి అనుసంధానిస్తుంది. బోస్ఫరస్పై నియంత్రణ ఉన్న తుర్కియే.. ఉద్రిక్తతలు పెరిగినా జలసంధిని తెరిచే ఉంచుతామని ఇప్పటికే ప్రకటించింది. రష్యా చమురు, గ్యాస్ ఎగుమతులపై పశ్చిమ దేశాల ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనసాగించే భారత్ సహా దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదనకు అమెరికా సెనేట్ జులై 29న ముందడుగు వేసింది. ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మీదుగా రైల్వే మార్గం ఏర్పాటైతే రష్యాకు హిందూ మహాసముద్రానికి ప్రత్యామ్నాయ భూతల మార్గం అందుబాటులోకి వస్తుంది.
