గురుకులాలపై రాజకీయాలు చేయకండి: అలుగు వర్షిణి

గురుకులాలపై రాజకీయాలు చేయకండి: అలుగు వర్షిణి
  • సోసైటీలో జరిగిన స్కామ్​ను పక్కదారి పట్టించేందుకే టాయిలెట్ల క్లీనింగ్ అంశాన్ని వివాదం చేస్తున్నరు
  • ప్రభుత్వ అనుమతి లేకుండా 800 మందిని నియమించి ప్రతి నెలా రూ.95 కోట్లు చెల్లించారు
  • టాయిలెట్ల క్లీనింగ్ పై ఆర్డర్స్ ఇవ్వలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గురుకులాలపై, గురుకుల స్టూడెంట్స్ పై రాజకీయాలు చెయెద్దని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో సోసైటీలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఇటీవల ఆడిట్ అధికారులు బయటపెట్టారని ఆమె వెల్లడించారు. ఈ స్కామ్ పై చర్చ జరగకుండా ఉండేందుకే టాయిలెట్ క్లీనింగ్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారని తెలిపారు. శనివారం మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లోని సోసైటీ ఆఫీసులో వర్షిణి మీడియాతో మాట్లాడారు. తాను చాలా రోజుల క్రితం ప్రిన్సిపల్స్ తో ఇంటర్నల్ మీటింగ్ లో రెండున్నర గంటల పాటు మాట్లాడిన వీడియోను నాలుగు నిమిషాలకు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపారు. 

గురుకులాల్లో శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారని, ఎవరిని తొలగించలేదని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లో గత ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి లో జరిగిన భారీ స్కామ్ కేంద్ర ఆడిట్ అధికారుల తనిఖీలో వెల్లడయిందని వర్షిణి చెప్పారు. ఈ రిపోర్ట్ ను త్వరలో ప్రభుత్వానికి, విజిలెన్స్ కు పంపిస్తామన్నారు. శాంక్షన్ పోస్ట్ లు లేకున్నా, ప్రభుత్వం అనుమతి లేకుండా ఎస్సీ గురుకుల సోసైటీలో దాదాపుగా 800 మందిని ఉద్యోగులుగా నియమించుకున్నారని తెలిపారు. 

ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నారని చెప్పారు. వీరితోపాటే జిల్లాకు ఒక సీఆర్ఓను సైతం నియమించడం జరిగిందన్నారు. వీరి జీతాలకు ప్రతినెలా రూ.95 కోట్లను ఖర్చు చేశారని చెప్పారు. సంస్థకు పనికి రాని వ్యక్తులను తొలగించడం ఈ మొత్తం అంతా ఆదా అయిందన్నారు. ఎస్సీ గురుకులాలో తొలిసారిగా మే లోనే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిందని తెలిపారు. పారదర్శకంగా సీట్ల భర్తీ చేస్తున్నామన్నారు. డిగ్రీలో 30 కొత్త కోర్సులు తీసుకొచ్చామని, అలాగే, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ తీసుకొచ్చామని చెప్పారు. కాలేజీలు తగ్గిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.