Bonalu 2024: అమ్మా బైలెల్లి నాదే.. తల్లి బైలెల్లి నాదే.. సికింద్రాబాద్​లో వైభవంగా బోనాల జాతర

Bonalu 2024: అమ్మా బైలెల్లి నాదే.. తల్లి బైలెల్లి నాదే.. సికింద్రాబాద్​లో వైభవంగా బోనాల జాతర

సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదమంత్రోచ్ఛరణల నడుమ ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మహాకాళి అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు జరుపుకునే పవిత్రమైన రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

తెలంగాణలో వందల ఏళ్లుగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా.. ఎంత స్థాయిలో ఉన్నా దేవతలను పూజించే విధానాలు ఒకేలా ఉంటాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని మంత్రి తెలిపారు. భక్తుల సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను సీతక్క ఆదేశించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టువస్త్రాలతోపాటు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. బోనాల జాతర సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొన్నది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.