మల్లారెడ్డికి 6లక్షల రైతుబంధు: బూర నర్సయ్య గౌడ్

 మల్లారెడ్డికి 6లక్షల రైతుబంధు: బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 98 లక్షల మంది రైతులు ఓట్లు వేస్తే 50లక్షల మందిని కేసీఆర్ వంచించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం రూ. 6వేల కోట్లు ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 600 ఎకరాలు ఉన్న మంత్రి మల్లారెడ్డికి రూ.6 లక్షల రైతుబంధు నిధులు ఇస్తున్నారని బూర విమర్శించారు. ఆయిల్ ఫాం కోసం కేంద్ర ఇస్తున్న రూ. 20లక్షల సబ్సిడీని తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని అన్నారు. 

రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బూర నర్సయ్య గౌడ్ కోరారు.రూపాయికి కిలో బియ్యం, రైతుబంధు తప్ప కేసీఆర్ కు ఏమీ కనబడటం లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం ప్రభుత్వం రూ.20వేల కోట్లు ఇస్తోందన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలో వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులను బీజేపీ తయారు చేస్తుందని, నేతలను కొనదని చెప్పారు.