- ఆల్టైం హై వద్ద ముగింపు
- సెన్సెక్స్@ 61,872
- నిఫ్టీ లాభం 74.25 పాయింట్లు
- బ్యాంకింగ్ స్టాక్స్లో భారీ కొనుగోళ్లు
ముంబై: మార్కెట్ బెంచ్మార్క్ సెన్సెక్స్ మంగళవారం 248 పాయింట్లు ఎగబాకి 61,872 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతోపాటు బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్లలో బలమైన కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టించాయి. రూపాయి బలపడడం, దేశీయంగా ఇన్ఫ్లేషన్ తగ్గడం, విదేశీ మూలధన ప్రవాహం తగ్గుముఖం పట్టడం సెంటిమెంట్ను మరింత బలపరిచాయని ట్రేడర్లు తెలిపారు. దీంతో సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేదా 0.40 శాతం పెరిగి 61,872.99 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది -- నవంబర్ 11న దాని మునుపటి ముగింపు గరిష్ట స్థాయి 61,795.04ని అధిగమించింది. నిఫ్టీ 74.25 పాయింట్లు లేదా 0.41 శాతం ఎగిసి18,403.40 వద్ద ముగిసింది. "గ్లోబల్ ఈక్విటీలలో లాభాలు కనిపించడంతో దేశీయ మార్కెట్లు ప్రారంభ నష్టాల నుంచి బయటపడ్డాయి. బ్యాంకింగ్ స్టాక్లు రికవరీకి దారితీశాయి. ఆహారం, వస్తువుల ధరల తగ్గుదల కారణంగా దేశీయ ఇన్ఫ్లేషన్ 7 శాతం కంటే తక్కువగా నమోదయింది. ఇది ఆర్బీఐ టాలరెన్స్ లిమిట్ అయిన 6 శాతంపైనే ఉంది" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
సెన్సెక్స్ గెయినర్స్ చార్ట్లో పవర్గ్రిడ్ 2.20 శాతం పెరిగి మొదటిస్థానంలో ఉండగా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, ఎం అండ్ ఎం, హెచ్డీఎఫ్సీ ట్విన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, రిలయన్స్, సన్ ఫార్మా నెస్లే ఇండియా వెనుకబడి ఉన్నాయి. ఇవి 0.76 శాతం వరకు తగ్గాయి. బ్రాడ్ మార్కెట్లో, బిఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.08 శాతం పెరిగింది. స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం మాత్రమే పెరిగింది. సెక్టోరల్ ఇండెక్స్లలో, చమురు & గ్యాస్ 0.99 శాతం, టెలికమ్యూనికేషన్ 0.79 శాతం, ఆటో (0.75 శాతం), బ్యాంకెక్స్ (0.70 శాతం), యుటిలిటీస్ (0.53 శాతం) పెరిగాయి.ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, మెటల్ రియల్టీ వెనుకబడి ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ బుల్స్ సెషన్ చివరి అరగంటలో బలంగా తిరిగి వచ్చిందని, ఇది ఇండెక్స్ను దాని కొత్త 52-వారాల గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లిందని ఎల్కేపీ సెక్యూరిటీస్లో సీనియర్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ అనలిస్ట్ కునాల్ షా చెప్పారు.
ఇన్ఫ్లేషన్ తగ్గుదలతో...
ధరల తగ్గుదలను సూచిస్తూ, అక్టోబర్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ 6.7 శాతానికి తగ్గగా, టోకు ధరల సూచీ 19 నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రధానంగా ఆహార వస్తువుల రేట్లు తగ్గాయి. సెప్టెంబరులో 7.41 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ఇన్ఫ్లేషన్ అక్టోబర్లో 6.77 శాతానికి తగ్గడం కూడా ఉపశమనం కలిగించింది. యూరోపియన్, ఆసియా సూచీలలో ఎక్కువ భాగం లాభాలను నమోదు చేశాయి. ముడి చమురు ధరల భారీ పతనం , డాలర్తో రూపాయి బలపడటం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచింది. దేశీయంగా ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడంతో, వచ్చే నెలలో జరగనున్న పాలసీ సమావేశంలో ఆర్బీఐ రేట్ల నిర్ణయంలో దూకుడుగా వ్యవహరిస్తుందని వ్యాపారులు భావిస్తున్నారని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఆసియాలోని సియోల్, టోక్యో, షాంఘై హాంకాంగ్ మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి.
ఇండోనేషియాలో జీ20 సమావేశానికి ముందు సోమవారం జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపించడంతో ఆసియా మార్కెట్లు బలమైన లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ ఇప్పట్లో 18,600 దాటదని అనుకుంటున్నాను. రాబోయే ఆరు నెలల్లో ఇది 15,200 స్థాయిని తాకుతుంది. ఆ తరువాత వచ్చే బుల్రన్ ఐదేళ్లపాటు ఉంటుంది. దాదాపు 27 వేల వరకు వెళ్తుంది. 15,200 స్థాయిని తాకాక కొనడం మొదలు పెట్టాలి. ఇప్పుడైతే నేను బేరిష్. లాంగ్టర్మ్కు అయితే బుల్లిష్గా ఉన్నాను.
- అనంత్ ఆచార్య , మార్కెట్ ఎనలిస్ట్