జవహర్ నగర్ కొత్త మేయర్ గా శాంతి

జవహర్ నగర్ కొత్త మేయర్ గా శాంతి
  •     సొంత పార్టీ నుంచి విమర్శలు
  •     కార్పొరేటర్ నిహారిక నిరాహార దీక్ష 

జవహర్ నగర్, వెలుగు :  జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ గా శాంతి కోటేశ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా క్యాంపు నుంచి కార్పొరేటర్లను  ప్రత్యేక బస్సులో  తరలించగా.. వారికి జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కార్పొరేషన్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. 19 మంది కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ గా విజయం సాధించినట్టు శాంతి కోటేశ్ గౌడ్ తెలిపారు. జవహర్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని  చెప్పారు. కాంగ్రెస్ కార్పొరేటర్ నిహారిక మేయర్ ఎన్నికను వ్యతిరేకిస్తూ  బైఠాయించి నిరాహార దీక్షకు దిగారు. 

పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. అవినీతి, కబ్జాదారులను అందలం ఎక్కించి జవహర్ నగర్ ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని డబ్బులకు కొనుగోలు చేశారని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.  డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేటర్ నిహారిక ఆరోపణలు సరికాదని అన్నారు. ఒంటెత్తు పోకడలతో నిహారిక వ్యవహరిస్తూ పదవుల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.