మహమ్మద్ షమీ ట్వీట్కు షోయబ్ అక్తర్ కౌంటర్

మహమ్మద్ షమీ ట్వీట్కు షోయబ్ అక్తర్ కౌంటర్

భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ట్వీట్కు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కౌంటర్ ఇచ్చాడు. ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఈ ఓటమిపై అక్తర్ గుండె పగిలే ఏమోజీని షేర్ చేశాడు. ఈ ట్వీట్ను రీ ట్వీట్ చేసిన మహమ్మద్ షమీ..‘‘దీన్నే కర్మ అంటారు బ్రదర్’’ అని కామెంట్ చేశాడు.  ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.  

తాజాగా మహమ్మద్ షమీ ట్వీట్ కు షోయబ్ అక్తర్ కౌంటర్ ఇచ్చాడు. పాకిస్థాన్ బౌలింగ్ బలం గురించి ఇండియన్ కామెంటేటర్ హర్ష భోగ్లే చేసిన ట్వీట్ను పోస్ట్ చేశాడు. ‘‘పాకిస్తాన్ జట్టుకు క్రెడిట్ ఇవ్వాలి..కొన్ని జట్లు మాత్రమే 137 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నాయి. పాకిస్థాన్ కూడా అదే చేసింది. బెస్ట్ బౌలింగ్ టీమ్’’ అంటూ హర్ష భోగ్లే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నే అక్తర్ పోస్ట్ చేస్తూ..దీన్నే సెన్సిబుల్ ట్వీట్ అంటారు అంటూ క్యాప్షన్ పెట్టాడు. 

నెదర్లాండ్స్ పుణ్యమా అని సెమీఫైనల్‌కు వచ్చిన పాక్.. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. దీంతో ఆ జట్టు టైటిల్ గెలిచినంత హడావుడి చేసింది. ఆ దేశ ప్రధానితో పాటు మాజీ ఆటగాళ్లు భారత వైఫల్యాన్ని హేళన చేశారు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లను చేతకాని వారని విమర్శించారు. అక్తర్ అయితే భారత బౌలింగ్ యూనిట్‌‌ను పాకిస్థాన్ బౌలర్లతో పోల్చుతూ  విమర్శలు గుప్పించాడు.