కేరళ నరబలి కేసులో షాకింగ్ నిజాలు

కేరళ నరబలి కేసులో షాకింగ్ నిజాలు
  • ప్రధాన నిందితుడు షఫీ.. సైకో కిల్లర్ గా గుర్తించిన పోలీసులు 
  • నిందితులు ముగ్గురికీ రిమాండ్ విధించిన కోర్టు 

తిరువనంతపురం: కేరళ నరబలి కేసులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చినంక వాళ్ల శరీర భాగాలను నిందితులు వండుకు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ముందు బాధితులను ఘోరంగా హింసించినట్లు గుర్తించారు. మహిళల రొమ్ములను కట్ చేసి, రక్తం పారేలా చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయని చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన కేరళలోని పథనంథిట్ట జిల్లా ఎలంథూర్ లో జరిగింది. రోసెలిన్, పద్మ అనే మహిళలను ట్రాప్ చేసిన మహమ్మద్ షఫీ(52).. భగవల్ సింగ్, లైలా దంపతులతో కలిసి వాళ్లను చంపేశాడు. నరబలి ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని దంపతులను నమ్మించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పద్మ గొంతు కోసి తల నరికేసిన షఫీ.. ఆమె బాడీని 56 ముక్కలు చేశాడని పోలీసులు చెప్పారు. అవన్నీ మూడు గుంతల్లో దొరికాయని తెలిపారు. రోసెలిన్ ను లైలా గొంతు కోసి చంపిందని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షఫీనే అని వివరించారు. ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది.

శాడిస్ట్.. షఫీ 

ఈ కేసులో సూత్రధారి మహ్మద్ షఫీనే అని పోలీసులు చెప్పారు. అతనో సైకో కిల్లర్, మానసిక రోగి, శాడిస్ట్ అని తెలిపారు. స్కూలు చదువు మధ్యలోనే వదిలేసిన షఫీ.. వక్రబుద్ధితో క్రూరంగా తయారయ్యాడని పేర్కొన్నారు. నిందితుడిపై ఇంతకుముందు కూడా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ‘‘గత 15 ఏండ్లలో షఫీపై కనీసం 10 కేసులు నమోదయ్యాయి. 75 ఏండ్ల మహిళపై రేప్ కు పాల్పడి కత్తితో దాడి చేశాడు. ఎలంథూర్ కేసులోనూ మహిళల బాడీలపై అదే రకమైన గాయాలు ఉన్నాయి” అని ఎర్నాకులం పోలీస్ కమిషనర్ నాగరాజు చెప్పారు. రేప్ కేసులో అరెస్టయిన షఫీ 2020లో బెయిల్​పై బయటకు వచ్చాడని తెలిపారు. పోర్న్ వీడియోల్లో నటిస్తే డబ్బులు ఇస్తానని నమ్మించి బాధిత మహిళలను భగవల్ సింగ్ ఇంటికి తీసుకెళ్లాడని వెల్లడించారు.