స్టట్గార్ట్: అమెరికా జిమ్నాస్టిక్ క్వీన్ సిమోన్ బైల్స్.. జిమ్నాస్టిక్స్లో కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ చాంపియన్షిప్లో ఆల్టైం రికార్డును బద్దలుకొడుతూ.. 25 పతకాలతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆదివారం జరిగిన బ్యాలెన్సింగ్ బీమ్ ఫైనల్లో 22 ఏళ్ల బైల్స్ 15.066 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకుంది. తద్వారా బెలారస్ జిమ్నాస్ట్ వితాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న అత్యధిక పతకాల ఆల్టైమ్ రికార్డును దాటింది. షెర్బో 1991 నుంచి 1996 మధ్య జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లలో 12 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు గెలిచాడు.
చైనాకు చెందిన లియు టింగ్ టింగ్(14.433), లి షిజియా(14.3) సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. తర్వాత జరిగిన ఫ్లోర్ ఎక్సర్ సైజ్ ఫైనల్లో 15.133 పాయింట్లతో మరో పసిడిని గెలిచిన బైల్స్.. రికార్డు స్థాయిలో 25వ మెడల్ను ఖాతాలో వేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ పోటీల్లో ఆమెకిది 19వ గోల్డ్ కాగా.. ఈ టోర్నీలో ఐదో గోల్డ్ కావడం విశేషం. ఫ్లోర్ ఎక్స్ర్ సైజ్ ఈవెంట్లో సహచర జిమ్నాస్ట్ సున్సియా లీ సిల్వర్ గెలవగా.. రష్యా ప్లేయర్ ఎంజెలినా మెల్నికొవా కాంస్యం సొంతం చేసుకుంది.