
పాలమూరు, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు బయటకు వస్తున్నారంటే చుట్టూ పోలీసులు, మందీమార్బలం ..మామూలు హడావిడి ఉండేది కాదు. సామాన్యులకు వారి దర్శనభాగ్యమే కరువయ్యేది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సాదాసీదాగా జనం మధ్య తిరుగుతూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం సెక్రెటేరియెట్వద్ద సామాన్యుల మాదిరిగా తిరుగుతూ కనిపించారు.
సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి పాలమూరు, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూధన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి సెక్రెటేరియెట్ దగ్గర ఓ పండ్ల దుకాణం వద్ద జ్యూస్ తాగారు. అక్కడికి వచ్చిన కొందరు పలకరించగా, నవ్వుతూ మాట్లాడారు. కాగా, పలువురు వీళ్ల ఫొటోలు తీసి పాలమూరు జిల్లాల గ్రూపుల్లో పెట్టగా వైరల్గా మారాయి.
గడీలాంటి ప్రగతిభవన్ గేట్లు తెరిచి ప్రజాభవన్గా మార్చిన సీఎం, మంత్రులు.. సామాన్యుల నుంచి వినతులు స్వీకరిస్తుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ వంతుగా ఇలా జనాలతో మమేకం అవుతున్నారని పలువురు కొనియాడారు. ఈ సింప్లిసిటీని ఇలాగే కొనసాగించాలని ఇంకొందరు ఆకాంక్షించారు.