సింగరేణి మిగులు విద్యుత్ ఓపెన్ మార్కెట్​లో విక్రయం

సింగరేణి మిగులు విద్యుత్ ఓపెన్ మార్కెట్​లో విక్రయం
  • ఐఈఎక్స్​ ద్వారా అమ్ముకునేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్
  • సేల్ ప్రాసెస్ ప్రారంభించిన సీఎండీ బలరామ్    

హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లా, జైపూర్‌‌‌‌లోని1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి మిగులు విద్యుత్‌‌‌‌ను ఓపెన్ మార్కెట్‌‌‌‌లో విక్రయించే ప్రక్రియను సింగరేణి శనివారం అధికారికంగా ప్రారంభించింది. సింగరేణి భవన్‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ వివరాలను వెల్లడించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏటా 1,200 మెగావాట్ల విద్యుత్‌‌‌‌ను ఉత్పత్తి చేస్తుండగా, ఇందులో ఎక్కువ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. మిగిలిన విద్యుత్‌‌‌‌ను దేశవ్యాప్తంగా ఇంధన అవసరాలున్న రాష్ట్రాలు, సంస్థలకు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) ద్వారా బహిరంగ మార్కెట్‌‌‌‌లో విక్రయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుమతి ఇచ్చారని ఎన్. బలరామ్ తెలిపారు.

ఈ విద్యుత్ విక్రయాల ద్వారా సింగరేణి సంస్థకు ఆర్థిక లాభం చేకూరడమే కాకుండా, దేశ ఇంధన అవసరాలను తీర్చడంతో పాటు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌‌‌‌ఎఫ్) కూడా పెరుగుతుందని  వివరించారు. ఈ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి. సత్యనారాయణ రావు, ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, ఈడీ (కోల్ మూమెంట్) ఎస్‌‌‌‌డీఎం సుభానీ, ఈడీ (ఎస్‌‌‌‌టీపీపీ) చిరంజీవులు, జీఎం (సీపీపీ) మనోహర్, జీఎం (మార్కెటింగ్) ఎన్‌‌‌‌వీ రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.