డాక్టర్లు టైమ్​కు రారు.. మందులిచ్చేటోళ్లు లేరు!

డాక్టర్లు టైమ్​కు రారు..   మందులిచ్చేటోళ్లు లేరు!
  • రంగారెడ్డి జిల్లాలోని సర్కార్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత  
  • జిల్లాస్థాయి దవాఖాన నుంచి పీహెచ్ సీ దాకా ఇదే పరిస్థితి 
  • కొత్త సర్కారైనా పట్టించుకోవాలని కోరుతున్న పేషంట్లు

ఎల్​బీనగర్,వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని సర్కారు దవాఖానల్లో డాక్టర్లు రాక, సిబ్బంది లేక, మందుల కొరత నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లా స్థాయి ఆస్పత్రి నుంచి యూపీహెచ్​సీలకు వరకు సరైన సౌలత్​లు లేవు. సర్కార్ దవాఖానలను నమ్ముకుని వెళ్లిన పేదలకు వైద్యం సరిగా అందడంలేదు. ప్రతి దవాఖానలో సమస్యలు నెలకొన్నాయి. ప్రాథమిక చికిత్స చేసే వైద్య పరికరాలు కూడా లేకపోవడంతో దవాఖానలకు వెళ్లే జనాలు, పేషెంట్లు నిరాశతో వెనుదిరిగి పోతున్నారు.

 కొన్ని పీహెచ్ సీలు పేరుకే ఉండగా.. మరికొన్నింటిలో కనీసం వార్డ్ బాయ్ కూడా లేని ఆస్పత్రులు ఉన్నాయి. డిప్యుటేషన్ పై వచ్చిన సిబ్బందే దవాఖానలను నడిపిస్తున్న దుస్థితి ఉంది. జిల్లాలో ఒక ఏరియా ఆస్పత్రి, 37 పీహెచ్ సీలు, 23 యూపీహెచ్​సీలు ఉన్నాయి. ఏ ఆస్పత్రిలో చూసినా సరైన వసతులు లేవు. ట్రిట్ మెంట్ లేక ప్రైవేట్ క్లినిక్స్, ఆస్పత్రులకు వెళ్తున్నారు. 

 కుక్కకాటుతో దవాఖానకు పోతే..

ఐదు నుంచి ఆరు పీహెచ్ సీలకు ఒక్క డాక్టర్ కూడా  లేడు. దీంతో ఆ ప్రాంతంలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులు వచ్చినా సర్కార్ దవాఖానల్లో  మందులు ఇచ్చేవాళ్లు లేక ప్రైవేట్ క్లినిక్స్​కు వెళ్తున్నారు. మరికొన్ని పీహెచ్ సీల్లో డాక్టర్లు పీజీలు వచ్చి ఉన్నతచదువులకు వెళ్లిపోయారు. ఆయా చోట్ల కొత్త డాక్టర్లను నియమించలేదు. 

అక్కడ సిబ్బంది రోగం పేరు చెబితే మందులు ఇచ్చి పంపుతున్నారు. రాములు అనే పేషెంట్ మన్సూరాబాద్ యూపీహెచ్ సీకి బీపీ చెక్ చేయించేకునేందుకు, బాలాపూర్ పీహెచ్ సీకి కుక్క కాటుతో ఓ రెండేళ్ల బాలుడిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో పేషెంట్లు వెనుతిరిగి వెళ్లిపోయారు. 200 బెడ్స్ ఆస్పత్రిగా చెప్పుకునే వనస్థలిపురం ఏరియా దవాఖానలోనూ డాక్టర్లు లేరు.

 సరిగా మెడికల్ టెస్ట్ లు చేయరు. ఇద్దరే ల్యాబ్ టెక్నిషియన్స్ ఉండగా ఔట్ సోర్సింగ్ కింద మరో ఇద్దరు ఉన్నారు. ఇక్కడ టెస్ట్ లు చేయరు.  రోజుకు సుమారు 200 ఓపీలు ఉండే ఇలాంటి ఆస్పత్రిలో టెస్ట్ ల కోసం వందల మంది బారులు తీరుతుంటారు. దీంతో ఒక్క టెస్ట్ చేయించుకోవాలన్నా రెండు రోజుల టైమ్ పడుతుంది. ఇక గర్భిణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. స్కానింగ్ చేసుకోవాలంటే ఐదు రోజుల ముందు నుండే అక్కడ నంబర్ వేయించుకోవాలి. ఇక జిల్లాలో బీపీ మెషీన్లు  అందుబాటులో ఉన్నాయని, డాక్టర్లు ఉన్నాయో లేవోదనే సమాచారం కూడా ఇవ్వడం లేదని డీఎంహెచ్ వో చెప్పారు. 

సరిపడా డాక్టర్లను నియమించాలని..

కొన్ని పీహెచ్​సీలు, యూపీహెచ్​సీల్లో    బీపీ మెషీన్లు కూడా లేని పరిస్థితి ఉందని, జ్వరం వస్తే చూడడానికి డాక్టర్లు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆదివారం,  సెలవు రోజుల్లో  కూడా సిబ్బంది ఉంటుండగా.. డాక్టర్లు సొంత సెలవులు ప్రకటించుకుని డ్యూటీలకు రావడంలేదు. రాత్రి 8 అయిందంటే దవాఖానా గేటుకు  తాళం పెట్టేస్తున్నారు. 

బీపీ చెక్ చేయించుకుందామని..

నాకు బీపీ ఉంది. చెక్ చేయించుకునేందుకు మన్సూరాబాద్ దవాఖానకు పోయిన. బీపీ మిషన్ లేదని పంపించారు. బయట రూ. 50 పెట్టి బీపీ చెక్ చేయించుకున్నా. డాక్టర్ ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పోతారో కూడా తెలియదు.  

రాములు, మన్సూరాబాద్

కుక్క కరిచిందని వెళ్తే..

కుక్క కరవడంతో బాలాపూర్ లోని యూపీహెచ్ సీ పోతే డాక్టర్ లేడని పంపించారు. ఇక్కడ డాక్టర్ లేక ఏడాదికిపైగా అవుతుంది. మందులు ఇచ్చే సిబ్బంది కూడా లేరు

ప్రవీణ్, బడంగ్ పేట్

సిబ్బంది కొరత ఉంది

రంగారెడ్డి జిల్లాలోని చాలా పీహెచ్ సీలు, యూపీహెచ్​సీల్లో డాక్టర్లు, సిబ్బంది లేని విషయం వాస్తవమే. అయితే, కొరత ఉన్న చోట డిప్యూటేషన్ మీద డాక్టర్లు, సిబ్బందిని పంపించి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. బీపీ చెక్ మెషీన్లు చాలా ఉన్నాయి. ఎక్కడైతే ఆ మెషీన్లు లేవో సంబంధిత పీహెచ్ సీ డాక్టర్ జిల్లా వైద్యారోగ్యశాఖకు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆ సమాచారం ఇవ్వడం లేదు.

 వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ వో