హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ వల్ల రెగ్యులర్ క్లాసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులపై దృష్టిపెట్టాయి. కొన్ని ఇప్పటికే స్టార్ట్ చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆన్ లైన్ క్లాసులు చెప్పాలని వర్సిటీలకు ఆదేశాలిచ్చాయి. కానీ ఈ క్లాసులు స్టూడెంట్లకు ఎంత వరకు ఉపయోగపడుతాయి? వారు వినేందుకు సిద్ధంగా ఉన్నారా ? తెలుసుకునేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి .
2,500 మందితో సర్వే
హెచ్సీయూ కమ్యూనికేషన్ విభాగం ప్రొఫెసర్ వినోద్ పావరాల, ప్రొఫెసర్ వాసుకి నేతృత్వంలో
ఆన్లైన్ క్లాసులు, ఇంటర్నెట్అవకాశాలు తదితర అంశాలపై ఆన్లైన్ సర్వే నిర్వహించారు. మొత్తం
2,500 మంది స్టూడెంట్లు సర్వేలో పాల్గొన్నారు. 90 శాతం మంది వద్ద మొబైల్ ఫోన్ ఉండగా, సగం
మంది మాత్రమే తమవద్ద ల్యాప్ టాప్లు ఉన్నాయని చెప్పారు. 90 శాతం మంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నట్టు చెప్పగా, వారిలో మూడొంతుల మంది మొబైల్ డేటా ప్యాకేజీలను వాడుతున్నట్టు పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎట్ల ?
ఆన్ లైన్ క్లాసులు వినేందుకు కేవలం 37 శాతం స్టూడెంట్లే జై కొట్టారు. 18 శాతం మంది ఆన్లైన్
క్లాసులు వద్దే వద్దని తేల్చి చెప్పారు. మరో 45 శాతం మంది మాత్రం అప్పుడప్పుడైతేనే ఒకే అనే సమాధానమిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సౌకర్యం కష్టమేనని చెప్పారు. చాలామంది ఇండ్లలో ఆన్లైన్ క్లాసులు వినేందుకు ప్లేస్ లేదని పేర్కొన్నారు.