
- సభలో ప్రతిపక్షాలకూ మాట్లాడే స్వేచ్ఛనిచ్చాం
- ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసంగం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజస్వామ్య పద్ధతిలో ప్రజల సంక్షేమానికి అనుగుణంగా తెలంగాణ శాసనసభను నిర్వహిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు సైతం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో రెండ్రోజుల పాటు సాగిన ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రసంగించారు.
తొలి శాసన సభాపతిగా విఠల్ బాయి పటేల్ వారసత్వాన్ని, విలువలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశ లేజిస్లేటివ్ చరిత్రలో విఠల్ బాయి పటేల్ పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. న్యాయవాద వృత్తిలో, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. 1925లో బ్రిటీష్ వలస పాలనలో విఠల్ బాయి పటేల్ సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికవడం ఆశామాషీ కాదన్నారు.
ఆయన ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, సెంట్రల్ అసెంబ్లీని సమర్థవంతంగా నడిపించిన తీరు స్పీకర్లకు మార్గదర్శిగా నిలుస్తాయని కొనియాడారు. వలస పాలనను వ్యతిరేకిస్తూ 1929లో భగత్ సింగ్, భటకేశ్వర్ దత్ సెంట్రల్ అసెంబ్లీలో బాంబుల విసిరారని, ఆ సమయంలో విఠల్ బాయి పటేల్ స్పీకర్గా ఉన్నారని, ఈ ఘటనపై ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించారని గుర్తుచేశారు. ప్రపంచ దేశాల నాయకులతో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రూపొందించిన మేనిఫేస్టోను ధైర్యంగా పటేల్ ఆవిష్కరించారన్నారు. విఠల్ బాయిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అసెంబ్లీని నడుపుతూ, ప్రజల సంక్షేమానికి అనుగుణంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.