మాదాపూర్, వెలుగు: మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి నుంచి జూబ్లీహిల్స్ వైపు నలుగురు యువకులతో వేగంగా వెళ్తున్న బెలినో కారు.. ముందు వెళ్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఆపై డివైడర్ను ఢీకొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో అప్పుడే డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఐటీ ఉద్యోగులు విఘ్నేశ్, భవిష్య తీవ్రంగా గాయపడ్డారు.
ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులోని వారు సేఫ్గా బయటపడ్డారు. కారు నడుపుతున్న ఎండీ ఖాజా సోఫియుద్దీన్ను వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి పిలవడంతో ఒక్కసారిగా వెనక్కి చూడటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం బాధితులిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
