గురుగ్రామ్ (హర్యానా): ఢిల్లీకి చెందిన సృష్టి పాండే ఓ దివ్యాంగురాలు. ఎక్కడికైనా వీల్ చైర్ లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఆమెది. చాలారోజుల తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ ఆమెను రెస్టారెంట్కు తీసుకెళ్లింది. కానీ, వీల్ చైర్తో లోపలికి వెళ్తే కస్టమర్లు డిస్ట్రబ్ అవుతారంటూ సిబ్బంది అడ్డుకున్నారు. గురుగ్రామ్ లోని రాస్తా రెస్టారెంట్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. తనకు జరిగిన ఈ అవమానంపై సృష్టి ట్వీట్ చేయడం.. అది వైరల్ కావడంతో దిగొచ్చిన రెస్టారెంట్ ఓనర్ గౌమతేశ్ సింగ్.. ట్విట్టర్లో సారీ చెప్పాడు. రెస్టారెంట్ సిబ్బందిని తమ భయ్యా (ఫ్రెండ్ అన్న) రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసినా లోపలికి పోనియ్యలేదని, అక్కడ జరిగిన మొత్తం సీన్ను సృష్టి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆదివారం ఓ మీడియా సంస్థ సృష్టితో లైవ్లో మాట్లాడించింది. గౌమతేశ్నూ లైన్లోకి తెచ్చింది. ఒక దివ్యాంగురాలిగా తనకు జరిగిన అవమానం ఇంకెవరికీ జరగకూడదని, ఆయన పబ్లిక్ గా తనకు క్షమాపణలు చెప్పాలని సృష్టి డిమాండ్ చేసింది. కానీ ఫోన్ నెంబర్ ఇస్తే పర్సనల్ గా ఫోన్ చేసి మాత్రమే సారీ చెప్తానని, ఇలా పబ్లిక్ గా చెప్పబోనంటూ గౌమతేశ్ లైన్ కట్ చేశాడు. కాగా, ఈ విషయంలో హెల్ప్ చేసేందుకు పోలీసులు కూడా ట్విట్టర్ ద్వారా సృష్టిని సంప్రదించారు.