MLC ఎన్నికలపై కుట్ర జరిగింది : ECకి కాంగ్రెస్ ఫిర్యాదు

MLC ఎన్నికలపై కుట్ర జరిగింది : ECకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఢిల్లీ: రాష్ట్రంలో స్ధానిక సంస్థల MLC ఎన్నికల నోటిఫికేషన్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ – CECకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ భేటీ అయ్యారు. స్ధానిక సంస్థల MLC ఎన్నికల నోటిఫికేషన్ పై ఉన్న అభ్యంతరాలను ఈసీకి తెలిపారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్.. అధికార TRS పార్టీకి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ECకి ఫిర్యాదు చేశారు దాసోజు శ్రవణ్.

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని ఈసీని కోరామన్నారు దాసోజ్ శ్రవణ్. తెలంగాణలో ఎన్నికలు గూడు పుఠాణిలాగా మారాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని విమర్శించారు. అర్ధరాత్రి ఎమ్మెల్సీ షెడ్యూల్ ఇచ్చి తెల్లవారుజాము నుంచే నామినేషన్ స్వీకరించడంలో ఏదో మతలబు ఉందన్నారు.

“TRSకు లబ్ది చేర్చేవిధంగా పాత ఎంపీటీసీ, జడ్పిటీసీలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికల ఓటింగ్ లో అవకాశం ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్ద కుట్ర పన్నారు. ఎన్నికల కమిషన్  కు అన్ని వివరాలను అందజేశాం. ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది” అన్నారు దాసోజు శ్రవణ్.