బాసరలో పర్యటిస్తున్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. ఇవాళ్టి నుంచి యూనివర్సిటీల విజిట్ లో భాగంగా.. బాసర ట్రిపుల్ ఐటీని పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ట్రిపుల్ ఐటీలోని క్యాంప్ లో తిరిగారు. ఐటి మెస్, ల్యాబ్, తరగతి గదులను అధికారులతో కలిసి పరిశీలించారు. పలు విద్యార్ధులు గవర్నర్ కు సమస్యలను వివరించారు. తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఇంచార్జ్ వీసీ సహా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి వెళ్తారు.
అంతక ముందు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు తమిళిసై. వేద పండితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకున్నారని చెప్పారు. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్లిన టైంలో.. పోలీసులు మీడియాను ఆలయంలోకి అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు.
