డీఎంకేకు రాజీనామా చేసిన సుబ్బులక్ష్మి జగదీశన్

డీఎంకేకు రాజీనామా చేసిన సుబ్బులక్ష్మి జగదీశన్

కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సుబ్బులక్ష్మి జగదీశన్  తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పంపించారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా  తన రాజీనామా లేఖలో ఆమె  వెల్లడించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ ద్వారా 1977లో రాజకీయాల్లో వచ్చిన సుబ్బులక్ష్మి .. ముందుగా మొడకుర్చి నియోజకవర్గంలో పోటీచేసి శాసనసభకు ఎన్నికయ్యారు.

ఎంజీఆర్‌ ప్రభుత్వంలో 1978 నుంచి 1980 వరకు చేనేత శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత అన్నాడీఎంకే పార్టీని వదిలి డీఎంకేలో చేరారు. అప్పటినుండి పార్టీలో కీలకనేతగా వ్యవహరిస్తూ వచ్చారు. 2004 లో మన్మోహన్‌సింగ్‌ మంత్రి వర్గంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా సుబ్బులక్ష్మి పనిచేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొడకుర్చి నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమె..  బీజేపీ అభ్యర్థి సరస్వతి చేతిలో 206 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.