- టార్గెట్ ని బట్టి కోట్లు తీసుకుంటున్న గ్యాంగ్స్
- రాష్ట్రంలో సుపారీ కల్చర్పై సిటీ పోలీసుల అలర్ట్
హైదరాబాద్, వెలుగు: పోలీసులంటే భయం ఉండదు. కోర్టులు,శిక్షలంటే బెదురు ఉండదు. పట్టపగలు, నడిరోడ్డుపై అయినా సరే.. కత్తులు, వెపన్స్ తో వీరంగం వేస్తారు. పక్కా ప్లాన్లు, రెక్కీలతో ప్రాణాలు తీసేస్తారు.. చనిపోయిన వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. పగలు, ప్రతీకారాలు కూడా ఉండవు. పైసల కోసమే ప్రాణాలను తోడేస్తారు.. పైసలిస్తే చాలు.. ఎవరినైనా హతమార్చే సుపారీ కిల్లర్స్ (కిరాయి హంతకులు) రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పరువు, ప్రతిష్టలు, ఆర్థిక లావాదేవీలు, గొడవల వంటివాటిని అవకాశంగా తీసుకుని.. నడిరోడ్డుపై నిండు ప్రాణాలకు ఖరీదు కడుతున్నారు. కనీసం రూ. 10 లక్షల నుంచి కోట్ల వరకూ డీల్స్ మాట్లాడుకుంటూ హత్యలు చేస్తున్నారు. గతంలో ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్ వంటి ప్రాంతాలకే పరిమితమైన సుపారీ గ్యాంగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇటీవల మన రాష్ట్రంలోనూ ముంబై మాఫియా తరహా సుపారీ హత్యలు పెరుగుతుండటంతో హైదరాబాద్ సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని పాత నేరస్తులు సైతం కిరాయి హంతకులుగా మారుతుండటంతో వారి కోసం వేట మొదలుపెట్టారు.
సుపారీ.. హత్యకు ఇచ్చే కిరాయి
ఓ వ్యక్తిని చంపడానికి కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకుని, డబ్బులు ఇవ్వడాన్నే సుపారీ అంటారు. ఈ సుపారీ కల్చర్ ముంబై మాఫియాలో పుట్టింది. ముంబైతో పాటు ఢిల్లీ, యూపీ, బీహార్ లో సుపారీ కిల్లర్ గ్యాంగ్స్ హై ప్రొఫెషనల్ గా పని చేస్తున్నాయి. ముంబై మాఫియా అడ్డాగా దేశవ్యాప్తంగా హిట్ మెన్ సుపారీ నెట్వర్క్ ను పెంచుకుంటున్నాయి. టార్గెట్ కెపాసిటీకి అనుగుణంగా రూ.కోటికి తగ్గకుండా డీల్ సెట్ చేసుకుని మర్డర్కి స్కెచ్ వేస్తున్నాయి. సిటీలో పెరుగుతున్న సుపారీ కల్చర్ పై పోలీసులు అలర్ట్ అయ్యారు. కిరాయి హంతకులుగా మారుతున్న పాతనేరస్తులు, రౌడీషీటర్లపై నిఘా పెట్టారు. గ్రేటర్లోని 3 కమిషనరేట్ల పరిధిలో మూడేండ్లుగా నమోదైన సుపారీ మర్డర్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
కోటి నుంచి 50 కోట్ల వరకూ డీల్స్..
హై ప్రొఫైల్ వ్యక్తులను చంపేందుకు దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ సుపారీ గ్యాంగ్ లు ఉన్నాయి. డార్క్ వెబ్సైట్స్తో పాటు కాంట్రాక్ట్ కిల్లర్స్ సైట్లో ప్రొఫైల్స్ అప్డేట్ చేసుకుంటున్నాయి. ఇందులో షార్ప్ షూటర్స్ దగ్గర్నుంచి రకరకాల ప్రొఫెషనల్ కిల్లర్స్ అందుబాటులో ఉంటున్నారని, మర్డర్ లు చేయించాలనుకునేవాళ్లు వాళ్లను కాంట్రాక్ట్ తీసుకుంటున్నట్లు కేస్ స్టడీస్ చెప్తున్నాయి. టార్గెట్, సుపారీ ఇచ్చేవారి స్థితిగతులను బట్టి.. కోటి నుంచి రూ.50 కోట్ల వరకూ డీల్స్ జరుగుతున్నాయని, అడ్వాన్స్గా 25 శాతం తీసుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు.
హేమంత్ మర్డర్లో స్థానిక కూలీలే..
గచ్చిబౌలిలో జరిగిన హేమంత్ మర్డర్లో స్థానిక కూలీలే రూ. 10 లక్షలకు ఆశపడి.. కిరాయి హంతకులుగా మారారు. ఇందుకు నెల రోజులు రెక్కీ వేశారు.హేమంత్, అవంతిరెడ్డికి అనుమానం రాకుండా.. ఆమె దగ్గరి బంధువులతోనే కలిసి కిడ్నాప్ చేసి.. మర్డర్ చేశారు.
బావ హత్యకు కానిస్టేబుల్ సుపారీ
ఈ నెల 8న శివరాంపల్లిలో జరిగిన జావెద్ హత్యలో సాజిద్ గ్యాంగ్కి కానిస్టేబుల్ సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తన బావ జావేద్ ను హత్య చేసేందుకు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చిన రాయదుర్గం కానిస్టేబుల్ షౌకత్తో పాటు హసన్నగర్కి చెందిన సాజిద్, అస్లంఖాన్, షఫీని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రియల్టర్ కిడ్నాప్.. రూ.30 కోట్లు డిమాండ్
వనస్థలిపురం పోలీస్స్టేషన్ లిమిట్స్లో జరిగిన కిడ్నాప్ శివారు ప్రాంతాల్లో కలకలం రేపింది. 2018 జనవరి 22న బీఎన్రెడ్డి నగర్కు చెందిన రియల్టర్ అనంతయ్యను సుపారీ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. సుపారీ ఇచ్చిన మాధవచారితో కలిసి రూ.30 కోట్లు డిమాండ్ చేసింది. చివరకు రూ.4 కోట్లు క్యాష్ కానీ10 ఎకరాల ల్యాండ్ కానీ రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించింది.
పక్కాగా స్కెచ్ వేస్తరు..
సుపారీ ఇచ్చిన వ్యక్తితో మనీ ట్రాన్సాక్షన్ తప్ప తమ యాక్షన్ ప్లాన్ ను షేర్ చెయ్యరు. 2, 3 నెలల ముందే హత్యకు ప్లాన్ చేస్తారు. టార్గెట్ ఏరియాలో రెక్కీ వేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్తో కనెక్ట్ అయ్యేందుకు స్కెచ్ వేస్తారు. స్థానిక సెక్యూరిటీ సిబ్బందినీ వాడుకుంటారు. ఫేక్ నంబర్ ప్లేట్లతో వెహికల్స్, ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్కార్డులు కొంటారు. ఆపరేషన్ అయ్యేవరకూ బేసిక్ ఫోన్లనే వాడతారు. మర్డర్ కు ముందు, తర్వాత ఫోన్లు వాడకుండా గమ్యస్థానాలకు చేరుతున్నారు. పోలీసులకు దొరికినా బెయిల్, కోర్టు ఖర్చులు కూడా సుపారీ ఇచ్చినోళ్లే భరించేలా డీల్ చేసుకుంటున్నారు.
ప్రణయ్ హత్యలో బీహార్ గ్యాంగ్
2018 సెప్టెంబర్14న మిర్యాలగూడలో ప్రణయ్ ని సుపారీ గ్యాంగ్ హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో బీహార్ గ్యాంగ్కు అమృత తండ్రి మారుతీరావు రూ.కోటి సుపారీ ఇచ్చాడు. మారుతీరావు, శ్రవణ్ బీహార్కు చెందిన సుభాష్ శర్మ, హజ్గర్ అలీ, మహ్మద్ భారీ, కరీం, శివ, ఎంఏ నిజాంతో కలిసి ప్రణయ్ మర్డర్ కు స్కెచ్ వేశారు. రూ.5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో రెండు నెలలు రెక్కీ వేశారు. అమృతకు హాని జరగకుండా ప్లాన్ చేశారు. ఈ కేసులో మారుతీరావు, అతని తమ్ముడు శ్రవణ్, బీహార్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐరన్ వ్యాపారి హత్యకు 2 కోట్ల సుపారీ
గతేడాది జులై 6న పంజాగుట్టలో ఐరన్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ దగ్గర్లో రాత్రి 8.30 గంటలకు జరిగిన హత్యలో ప్రధాన నిందితుడు కోగంటి సత్యం, శ్యామ్తో పాటు మరో ఐదుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 కోట్ల వ్యాపార లావాదేవీల కారణంగానే రాంప్రసాద్ హత్యకు రూ. 2 కోట్ల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.