
- ప్రస్తుతం త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్
- తెలంగాణ నుంచి మద్రాస్కు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్)ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ ఏకే సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
ఏకే సింగ్1965 జులై 7న జన్మించారు. 1990లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001లో జార్ఖండ్ హైకోర్టుకు న్యాయవాద ప్రాక్టీస్ను మార్చారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయిన నాటి నుంచి తెలంగాణ హైకోర్టు సీజే పోస్టు ఖాళీగా ఉంది.
ఈ ఏడాది జనవరి 21 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ వ్యవహరిస్తున్నారు. ఆయనను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తాజాగా దేశంలోని నాలుగు హైకోర్టుల చీఫ్ జస్టిస్లను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం తీర్మానం చేసింది. ఆ నలుగురిలో జస్టిస్ కేఏ సింగ్ను త్రిపుర నుంచి తెలంగాణకు కేటాయించాలని సిఫార్సుల్లో పేర్కొంది. జార్ఖండ్ హైకోర్టు సీజేగా ఉన్న తెలంగాణకు చెందిన జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావును త్రిపుర హైకోర్టు బదిలీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా రాజస్థాన్ సీజే జస్టిస్ ఎం.ఎం.శ్రీవాత్సవను మద్రాస్ హైకోర్టు సీజేగా, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ కేఆర్ శ్రీరామ్ను రాజస్తాన్ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని కూడా కొలీజియం సిఫార్సు చేసింది.
జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్ కుమార్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జస్టిస్ టి.వినోద్కుమార్ 2019 ఆగస్టు 19న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ వినోద్కుమార్ బదిలీలు, తెలంగాణ హైకోర్టుకు తిరిగి రాబోయో ముగ్గురు న్యాయమూర్తులు (కర్నాటక నుంచి జస్టిస్ సి.సుమలత, జస్టిస్ కన్నెగంటి లలిత, పాట్నా హైకోర్టు నుంచి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి), కొత్త సీజే జస్టిస్ ఏకే సింగ్ నియామకాల తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుతుంది. మరో 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి.