
వర్షాకాల సీజన్ కావడంతో రాష్ట్రంలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. రైతులను నట్టేట ముంచుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి భారీగా నకిలీ విత్తనాలు అక్రమంగా సరఫరా చేస్తున్నారు. జూన్ 10న సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు పోలీసులు. 65 లక్షల విలువ గల 2200 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణోదయ , అడ్వాన్స్ 333 కంపెనీల పేరిట అమ్మకాలు జరుపుతున్నారు వ్యాపారులు. 9 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.
నకిలీ విత్తనాలను ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ముఠాని సూర్యపేట సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. గడ్డి మందు చీడపీడలు తట్టుకునేవని నమ్మించి నకిలీ విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని మోతె , ఆత్మకూరు ( s ) మండలాల్లోని అమాయక రైతులకు అమ్ముతున్నారు కేటుగాళ్ళు. ఈ క్రమంలోనే పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
జూన్ 10న ఉదయం ఖమ్మంలో నకిలీ మిర్చి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. 115 ప్యాకెట్లను సీజ్ చేశారు. ఇద్దరిపై పీడియాక్ట్ కేసు పెట్టారు పోలీసులు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.